హైదరాబాద్లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న మిలిటరీ స్థావరం భద్రతా లోపాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బొల్లారంలోని 20వ మద్రాస్ ఆర్మీ రెజిమెంట్లో భారీ స్థాయిలో ఆయుధాలు చోరీకి గురికావడం, ఆ మరుసటి రోజే ఆర్మీ క్యాంప్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో భారీగా డిటోనేటర్లు బయటపడటం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆర్మీ అంతర్గత విచారణతో పాటు తెలంగాణ పోలీసులు, కేంద్ర మిలిటరీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు ప్రారంభించాయి.

ఆగస్టు 30 రాత్రి నుంచి ఆగస్టు 31వ తేదీ తెల్లవారుజాము మధ్య చోరీ జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆర్మీ కంటోన్మెంట్ లోపల ఉన్న ఆర్మరీ (ఆయుధాల నిల్వ గది) తాళాలను అగంతకులు విరగ్గొట్టి, లోపలికి ప్రవేశించారు. 4 ఏకే-47 రైఫిళ్లు, 6 పిస్టళ్లు, 1 ఇన్సాస్ రైఫిల్తో పాటు మరొక ఆయుధం కలిపి మొత్తం 12 అత్యాధునిక ఆయుధాలను దొంగిలించారు. వీటితో పాటు మరికొన్నింటిని కూడా ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది.
అత్యున్నత స్థాయి భద్రత ఉండే సైనిక పరిసరాల్లోకి సాధారణ వ్యక్తులు ప్రవేశించడం అసాధ్యం. ఈ నేపథ్యంలో లోపలి సిబ్బంది సహకారం లేకుండా ఈ స్థాయిలో చోరీ జరగదని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆయుధాల చోరీ ఘటనపై బొల్లారం పోలీసు స్టేషన్లో కేసు నమోదై విచారణ కొనసాగుతుండగానే, మద్రాస్ రెజిమెంట్ ఫైరింగ్ రేంజ్ వెనుక ఉన్న గోడ వద్ద ఒక అనుమానాస్పద ప్లాస్టిక్ బకెట్ లభ్యమైంది.
ఆర్మీ సిబ్బంది ఆ బకెట్ను తనిఖీ చేయగా అందులో 8 బండిళ్లలో ప్యాక్ చేసిన 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు బయటపడ్డాయి. మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.32,000 వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి బాంబ్ డిస్పోజల్ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆ డిటోనేటర్లను స్వాధీనం చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించింది.
మిలిటరీ నుంచి ఏకే-47 వంటి ఆయుధాలు, భారీగా తూటాలు, డిటోనేటర్లు మాయమవ్వడం వెనుక ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా? లేదా అక్రమ ఆయుధ వ్యాపారుల ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసు ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తున్నారు.
{{/usCountry}}మిలిటరీ నుంచి ఏకే-47 వంటి ఆయుధాలు, భారీగా తూటాలు, డిటోనేటర్లు మాయమవ్వడం వెనుక ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా? లేదా అక్రమ ఆయుధ వ్యాపారుల ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసు ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తున్నారు.
{{/usCountry}}కంటోన్మెంట్ సరిహద్దులు, అన్ని చెక్పోస్టులు, సీసీటీవీ ఫుటేజీలను సైనిక, సివిల్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. లోపలి వ్యక్తుల కాల్ డేటా, విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన వ్యవహారం కావడంతో అధికారులు కేసు సమాచారాన్ని తీవ్ర గోప్యంగా ఉంచుతూ, నిందితుల కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.