జగిత్యాల జిల్లాలో 300 కుక్కలపై విషప్రయోగం - కేసులు నమోదు

జగిత్యాల జిల్లా పెగడపల్లి గ్రామంలో దారుణం వెలుగు చూసింది. సుమారు 300 వీధి కుక్కలను విష ప్రయోగం చేసి చంపేశారు. జంతు ప్రేమికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 900కిపైగా కుక్కులను చంపేసినట్లు లెక్కలు సూచిస్తున్నాయి.

Published on: Jan 24, 2026 5:08 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవలే కాలంలో తెలంగాణలో వీధి కుక్కల హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్థానిక ఎన్నికల వేళ చాలా గ్రామాల్లో వీధి కక్కుల సమస్యపై పలువురు అభ్యర్థులు హామీలిచ్చారు. ఈ క్రమంలోనే గెలుపొందిన చాలా మంది సర్పంచ్ లు… వీధి కక్కుల సమస్యలను తగ్గించే క్రమంలో దారుణానికి ఒడిగడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి . విష ప్రయోగాలతో చంపేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వందల సంఖ్యలో వీధి కుక్కులు చనిపోయిన ఘటనలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

వీధి కుక్కలపై విషప్రయోగం (representative image )
వీధి కుక్కలపై విషప్రయోగం (representative image )

తాజాగా జగిత్యాల జిల్లాలో 300 కుక్కలు మృతి చెందాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన వీధి కుక్కల సంఖ్య 900కు చేరింది. జనవరి 22న పెగడపల్లి గ్రామంలో 300 వీధి కుక్కలను విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి చంపినట్లు ఫిర్యాదు అందటంతో ఈ ఘటన బయటికి వచ్చింది. ఈ దారుణమైన చర్యకు గ్రామ సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి కారణమని పలువురు జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు.

వీధి కుక్కలను చంపడానికి కొంతమంది వ్యక్తులను నియమించుకున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా…. పోలీసులు వీరిద్దరిపై బిఎన్ఎస్ తో పాటు జంతువులపై క్రూరత్వ నివారణ (పీసీఏ) చట్టం- 1960లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

శనివారం ఇన్ స్పెక్టర్ సిహెచ్ కిరణ్ మాట్లాడుతూ… విచారణ సమయంలో శ్మశాన వాటిక నుంచి సుమారు 70 నుండి 80 కుక్కల కళేబరాలను వెలికితీసినట్లు పేర్కొన్నారు. మూడు, నాలుగు రోజుల క్రితం ఖననం జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. “ప్రస్తుత దశలో నిందితుల ప్రమేయం ఉందో లేదో ధృవీకరించలేము. పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాత అసలు విషయాలు బయటికి వస్తాయి” అని వెల్లడించారు.

ఒక్క జనవరిలోనే రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వీధి కుక్కల హత్యలు జరిగియాని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనవరి 19న రంగారెడ్డి జిల్లాలోని యాచారం గ్రామంలో 100 కుక్కలకు విషం ఇచ్చి చంపినట్లు ఆరోపణలు బయటికి వచ్చాయి. ఈ ఘటనలో 50 మృతదేహాలు వెంటనే బయటపడ్డాయి. అంతేకాకుండా హన్మకొండ జిల్లాలోని శ్యాంపేట, ఆరేపల్లి గ్రామాల్లో కూడా వందల సంఖ్యలో కుక్కలను హతమార్చారు. ఆయా కేసుల్లో ఇద్దరు మహిళా సర్పంచ్లు, వారి భర్తలతో సహా తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో కామారెడ్డి జిల్లాలో సుమారు 200 వీధి కుక్కలను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో ఐదుగురు గ్రామ సర్పంచ్ లతో సహా పలువురు కేసు నమోదు చేశారు.