మేడారంలో ఏఐ డ్రోన్ వ్యవస్థ... జియో ట్యాగ్లతో నిఘా, తప్పిపోయే ఛాన్స్ ఉండదిక..!
మేడారం జాతరకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. జాతర భద్రతను పర్యవేక్షించేందుకు 'టీజీ-క్వెస్ట్' అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. మరోవైపు జాతరకు వచ్చే భక్తులు ఎవరూ తప్పిపోకుండా చర్యలను చేపడుతున్నారు.
తెలంగాణా కుంభమేళాగా పేరుపొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఆ దిశగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తుండగా…. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చూస్తోంది. ముఖ్యంగా భద్రతపరంగా ఈసారి మేడారం జాతరలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించనుంది.

జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) ఆధారిత వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. ఇటీవలనే జాతరలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు.
అత్యాధునిక డ్రోన్ వ్యవస్థ…
మేడారం జాతరలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ఎవరూ తప్పిపోకుండా ప్రజలందరికీ సురక్షిత జాతర అనుభవం కలిగించేలా జాతర భద్రతను పర్యవేక్షించేందుకు 'టీజీ-క్వెస్ట్' అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ ద్వారా 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అటవీ ప్రాంతం… జంపన్నవాగు, రద్దీ రోడ్లపై ఈ డ్రోన్లు నిరంతరం నిఘా ఉంటాయి.
ఇవి మాత్రమే కాకుండా హీలియం బెలూన్లకు అమర్చిన పాన్-టిల్ట్-జూమ్ కెమెరాలు ఎత్తు నుంచి రద్దీని విశ్లేషిస్తాయి. తొక్కిసలాట జరిగే అవకాశమున్న ప్రాంతాలను ముందే పసిగట్టి అధికారులను అప్రమత్తం చేస్తాయి. దాదాపు 13 వేల మంది పోలీసు సిబ్బంది ఈ టెక్నాలజీ సర్వైలెన్స్ లో విధులు నిర్వహించనున్నారు. మేడారం జాతరలో చాలా పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు కాబట్టి ఎక్కువ శాతం తప్పిపోయే అవకాశం ఉంటుంది.
- దాదాపు ఈసారి మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న క్రమంలో జాతరకు వచ్చే భక్తులు ఎవరూ తప్పిపోకుండా చర్యలను చేపడుతున్నారు. గత జాతరలో చాలా మంది భక్తులు తప్పిపోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి 'జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్' వ్యవస్థను తీసుకు వస్తున్నారు. వొడాఫోన్-ఐడియా సహకారంతో ఈ విధానం అందుబాటులో ఉంటుంది._
- పస్రా, తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్లలో వృద్ధులు, పిల్లల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ గల జియోట్యాగ్లను కడతారు. దీంతో వారు ఎవరైనా తప్పిపోయినా ఈ ట్యాగ్ ను స్కాన్ చేయటం ద్వారా వారి పూర్తి వివరాలు తెలుస్తాయి. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో అమలు చేయటానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.
- తెలుగు, ఇంగ్లీష్తో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. జాతరలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేకంగా 12 క్రైమ్ బృందాలు పనిచేస్తున్నాయి. పాత నేరస్థుల గుర్తింపునకు ఆసుపత్రి ప్రాంగణాలు, పార్కింగ్ స్థలాల వద్ద 'ఫేస్ రికగ్నిషన్' సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను గుర్తించే రియల్-టైమ్ అలర్ట్ సిస్టమ్ను కూడా సిద్ధం చేశారు.

E-Paper












