మల్లన్న జాతరలో కులవివక్ష ఆరోపణలు.. రెండు నెలల శిశువు మృతి, కేసు నమోదు!
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. ఓ రెండు నెలల శిశువు మృతి చెందింది. అయితే కుల వివక్ష కారణంగా జరిగిన గొడవ తర్వాతనే శిశువు మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
నాగర్ కర్నూల్లో కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా జరిగిన గొడవతో రెండు నెలల చిన్నారి చనిపోవడం కలకలం రేపింది. జాతరకు వెళ్లిన భక్తులతో అమర్యాదగా ప్రవర్తించడం, దాడి జరగడం, తోపులాటలో రెండు నెలల పాప ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఘటనలో పోలీసులు గతంలో కేసు నమోదు చేయడానికి నిరాకరించారని ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు కేసు నమోదైంది.

బాధితుల కథనం ప్రకారం.. కుమ్మెర మల్లన్న జాతర ఉత్సవాల్లో భాగంగా అదే గ్రామానికి చెందిన చంద్రకళ, గణేశ్, తన భార్య మౌనిక, రెండు నెలల కుమార్తె, దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు. టికెట్ విషయంలో ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డికి, భక్తురాలు చంద్రకళకు మధ్య వివాదం నడిచింది. గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డితోపాటుగా మరికొందరు నిర్వాహకులు ప్రవేశ ద్వారం వద్దనే తమను ఆపారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
తన కుటుంబాన్ని ఆలయంలోకి ప్రవేశించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని చంద్రకళ ప్రశ్నించినప్పుడు, నిర్వాహకులు తనను, తన కుమారుడు గణేష్, కోడలు, కుమార్తెను దుర్భాషలాడి, దాడి చేశారని బాధిత కుటుంబం చెప్పుకొచ్చింది. ముఖ్యంగా రెండు నెలల శిశువు ఉండటంతో గొడవ ఆపమని పదే పదే వేడుకున్నప్పటికీ నిర్వాహకులు దాడి చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుల వివక్ష చూపించారని ఆరోపణలు చేశారు.
దాడి సమయంలో శిశువును తన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి పాప మరణించింది. వెనుకబడిన కులాలకు చెందిన వారు కాబట్టి తమ కుటుంబానికి ఆలయంలోకి ప్రవేశం నిరాకరించారని బాధితు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎన్నడూ లేని విధంగా డబ్బులు వసూలు చేయాలని చూశారని పేర్కొ్న్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఉన్న సాక్షుల వాంగ్మూలాలు, సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
అంతకుముందు చంద్రకళ, ఆమె కుటుంబం ఫిర్యాదు చేయడానికి నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ను సంప్రదించినప్పుడు పోలీసులు తమను బెదిరించారని, ఫిర్యాదును నమోదు చేయడానికి నిరాకరించారని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కానీ ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిర్వాహకులు అగ్ర కులానికి చెందినవారని, కాంగ్రెస్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారని, అందుకే చర్యలు తీసుకోకుండా చూస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం కావాలని, రక్షణ కల్పించాలని, శిశువు మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. 'నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం. దాడిని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది. పాప కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పాం. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు నామమాత్రపు కేసులు పెట్టి రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పసి పాప మృతికి కారణమైన వారి పై కేసులు పెట్టి నిందితుల పై చర్యలు తీసుకోవాలి. కులవివక్షతో దాడి చేసి పసి బిడ్డ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ ఎస్పీతో ఫోన్లో డిమాండ్ చేశాం.' అని కవిత అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


