మల్లన్న జాతరలో కులవివక్ష ఆరోపణలు.. రెండు నెలల శిశువు మృతి, కేసు నమోదు!

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. ఓ రెండు నెలల శిశువు మృతి చెందింది. అయితే కుల వివక్ష కారణంగా జరిగిన గొడవ తర్వాతనే శిశువు మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Published on: Feb 22, 2026 4:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాగర్ కర్నూల్‌లో కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా జరిగిన గొడవతో రెండు నెలల చిన్నారి చనిపోవడం కలకలం రేపింది. జాతరకు వెళ్లిన భక్తులతో అమర్యాదగా ప్రవర్తించడం, దాడి జరగడం, తోపులాటలో రెండు నెలల పాప ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఘటనలో పోలీసులు గతంలో కేసు నమోదు చేయడానికి నిరాకరించారని ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు కేసు నమోదైంది.

ప్రతీకాత్మక చిత్రం (Unsplash)
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

బాధితుల కథనం ప్రకారం.. కుమ్మెర మల్లన్న జాతర ఉత్సవాల్లో భాగంగా అదే గ్రామానికి చెందిన చంద్రకళ, గణేశ్, తన భార్య మౌనిక, రెండు నెలల కుమార్తె, దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు. టికెట్ విషయంలో ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డికి, భక్తురాలు చంద్రకళకు మధ్య వివాదం నడిచింది. గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డితోపాటుగా మరికొందరు నిర్వాహకులు ప్రవేశ ద్వారం వద్దనే తమను ఆపారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.

తన కుటుంబాన్ని ఆలయంలోకి ప్రవేశించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని చంద్రకళ ప్రశ్నించినప్పుడు, నిర్వాహకులు తనను, తన కుమారుడు గణేష్, కోడలు, కుమార్తెను దుర్భాషలాడి, దాడి చేశారని బాధిత కుటుంబం చెప్పుకొచ్చింది. ముఖ్యంగా రెండు నెలల శిశువు ఉండటంతో గొడవ ఆపమని పదే పదే వేడుకున్నప్పటికీ నిర్వాహకులు దాడి చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుల వివక్ష చూపించారని ఆరోపణలు చేశారు.

దాడి సమయంలో శిశువును తన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి పాప మరణించింది. వెనుకబడిన కులాలకు చెందిన వారు కాబట్టి తమ కుటుంబానికి ఆలయంలోకి ప్రవేశం నిరాకరించారని బాధితు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎన్నడూ లేని విధంగా డబ్బులు వసూలు చేయాలని చూశారని పేర్కొ్న్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఉన్న సాక్షుల వాంగ్మూలాలు, సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

అంతకుముందు చంద్రకళ, ఆమె కుటుంబం ఫిర్యాదు చేయడానికి నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించినప్పుడు పోలీసులు తమను బెదిరించారని, ఫిర్యాదును నమోదు చేయడానికి నిరాకరించారని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కానీ ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నిర్వాహకులు అగ్ర కులానికి చెందినవారని, కాంగ్రెస్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారని, అందుకే చర్యలు తీసుకోకుండా చూస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం కావాలని, రక్షణ కల్పించాలని, శిశువు మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. 'నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం. దాడిని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది. పాప కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పాం. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు నామమాత్రపు కేసులు పెట్టి రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పసి పాప మృతికి కారణమైన వారి పై కేసులు పెట్టి నిందితుల పై చర్యలు తీసుకోవాలి. కులవివక్షతో దాడి చేసి పసి బిడ్డ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ ఎస్పీతో ఫోన్‌లో డిమాండ్ చేశాం.' అని కవిత అన్నారు.