బయో-సీఎన్‌జీ రంగంలో రూ. 4,000 కోట్ల పెట్టుబడి.. ప్రభుత్వంతో ఎంఓయూ

బయో-సీఎన్‌జీ రంగంలో రూ. 4,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది అతిరథ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్. ఈ మేరకు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది.

Published on: Dec 9, 2025, 09:25:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అతిరథ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గ్లోబల్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025లో అతిరథ్ హోల్డింగ్స్ ఛైర్మన్ లెఫ్టినెంట్ ఆర్ బాలకృష్ణన్, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంతకాలు చేశారు. రాష్ట్ర పునరుత్పాదక శక్తి లక్ష్యాల్లో ఇది ఒక పెద్ద మైలురాయిగా చెప్పవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వంతో అతిరథ్ హోల్డింగ్స్ ఎంఓయూ
ప్రభుత్వంతో అతిరథ్ హోల్డింగ్స్ ఎంఓయూ

9 వేల ఉద్యోగాలు

ఈ సందర్భంగా లెఫ్టినెంట్ బాలకృష్ణన్ మాట్లాడుతూ తెలంగాణలో స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు ఒక ముందడుగుగా అభివర్ణించారు. రూ.4,000 కోట్లతో రాష్ట్రంలో 25 కంప్రెస్డ్ బయో-గ్యాస్ (సీబీసీ) ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ప్లాంట్ రోజుకు 20 టన్నుల (టీపీడీ) సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 9,000 పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు రానున్నాయన్నారు. యువతతో పాటు రైతులకు పెద్ద ఎత్తున లాభం చేకూరనుందని చెప్పారు. తెలంగాణలో మొదటి సీబీజీ ప్లాంట్‌కు భూమిపూజను జనవరిలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగతా ప్లాంట్లు కూడా దశల వారీగా ప్రారంభమవుతాయన్నారు. ఈ ప్రాజెక్ట్ 15 నెలల్లో పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు.

పత్యామ్నాయం

కంప్రెస్డ్ బయో - గ్యాస్ (సీబీజీ) లేదా బయో - సీఎన్జీ అనేది సేంద్రీయ పదార్థాల్ని అనయిరోబిక్ డైజెషన్, శుద్ధీకరణ ప్రక్రియల ద్వారా ఉత్పత్తి చేసే పునరుత్పాదక, శుభ్రమైన ఇంధనం అన్నారు బాలకృష్ణన్. ఇందులో 98 శాతానికి పైగా మీథేన్ ఉండటం వల్ల దీని లక్షణాలు సాంప్రదాయ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో చాలా దగ్గరగా ఉంటుందన్నారు. అందువల్ల ఇది ఆటోమొబైల్, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో సీఎన్జీకి ఒక ఉత్తమ ప్రత్యామ్నాయం అవుతుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక పెట్టుబడి తెలంగాణను గ్రీన్ ఎనర్జీ, స్థిరమైన అభివృద్ధి రంగాల్లో వేగంగా ఎదుగుతున్న కేంద్రంగా నిలబెడుతుందన్నారు.

ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా

'ప్రపంచవ్యాప్తంగా కార్బన్ న్యూట్రాలిటీ వైపు మార్పు జరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రీన్యూవబుల్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా అనేకమంది ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులు, టెక్నోక్రాట్ల బృందం ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా చూస్తున్న ఈ సీబీజీ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం. నెపియర్ గడ్డిని పర్యావరణహిత ఇంధనంగా మార్చడంలో కీలకమైన ఈ ఇన్నోవేటివ్ బయో-కంప్రెస్డ్ గ్యాస్ (సీబీజీ) ప్రాజెక్ట్ ద్వారా అతిరథ్ హోల్డింగ్స్ తెలంగాణలో పునరుత్పాదక శక్తి రంగంలో ఒక మహత్తర మార్పునకు నాంది పలుకుతోంది.' అని బాలకృష్ణన్ వెల్లడించారు.

ఏపీలోనూ పెట్టుబడి

దేశవ్యాప్తంగా బయో-సీఎన్జీ ప్రాజెక్టుల మీదనే కంపెనీ ప్రధానంగా దృష్టి సారించిందని బాలకృష్ణన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఒక ముఖ్యమైన ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. 2025 నవంబర్ 14న, 30వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2025లో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేసినట్టుగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 20 టీపీడీ సామర్థ్యంతో 25 సీబీజీ ప్లాంట్లు స్థాపించేందుకు మొత్తం రూ. 4,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. మొదటి ప్రాజెక్ట్‌కు భూమిపూజ 2025 నవంబర్ 26న ప్రకాశం జిల్లా పొదిలి సమీపంలోని గుంద్లసముద్రం వద్ద నిర్వహించామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More