తెలంగాణ భవన్లో రేపు(ఆదివారం) బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ కానుంది. ఇందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది.
సాగునీటి హక్కులపై పోరుబాట..!

ముఖ్యంగా ఏపీ ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీ సర్కార్ తెరపైకి తీసుకువస్తున్న ప్రాజెక్టులు… తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ఉద్యమాన్ని చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకే ఒప్పుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నాడు బీఆర్ఎస్ 91 టీఎంసీలు కేటాయిస్తే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం వద్ద మోకరిల్లిందని విమర్శలు చేస్తోంది. నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని ఆరోపిస్తోంది.
రాష్ట్రానికి 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా నోరు మెదపకపోవడం లేదని చెబుతోంది. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ రైతాంగ ప్రయోజనాలపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్… ఈ భేటీని నిర్వహించనున్నారు.
సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై కూడా చర్చ జరుగొచ్చని సమాచారం. మొత్తంగా చూస్తే…. కృష్ణా జలాల విషయంపై బీఆర్ఎస్ మరో పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. రేపటి భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని సమాచారం.