Delhi Liquor Case : దిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్.. కేసులు కొట్టేసిన కోర్టు.. సీబీఐపై సీరియస్

దిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించింది. కేసును కొట్టివేసింది. అంతేకాదు సీబీఐపై తీవ్ర విమర్శలు చేసింది కోర్టు.

Published on: Feb 27, 2026 12:28 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దిల్లీ మద్యం పాలసీ కేసులో కల్వకుంట్ల కవిత పెద్ద ఉపశమనం లభించింది. ఆమె ఆడిటర్ బుచ్చి బాబుతో సహా ఇతర నిందితులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసిన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆప్ నాయకులు మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇతర నిందితులపై సీబీఐ దాఖలు చేసిన కేసును కూడా కోర్టు కొట్టివేసింది.

కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత

రెండు వైపుల నుండి వివరణాత్మక వాదనలు విన్న తర్వాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. తన ఉత్తర్వులో కోర్టు సీబీఐపై తీవ్ర విమర్శలు చేసింది. కేసు నమోదు, దర్యాప్తు విధానాన్ని తీవ్రంగా విమర్శించింది. ప్రక్రియలో తీవ్రమైన లోపాలను గమనించిన కోర్టు, కేసు నమోదు, దర్యాప్తు నిర్వహణ రెండింటిలోనూ ఏజెన్సీ విధానాన్ని తప్పుబట్టింది. చివరికి నిందితులందరిపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది.

కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇలా మెుత్తం 23 మందికి ఈ కేసులో ఉపశమనం లభించింది. వారిపై ఎటువంటి క్రిమినల్ ఆధారాలు సమర్పించలేకపోవడంతో వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది.

ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఈ కేసు కారణంగా కవిత, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ పెద్ద రాజకీయ పరిణామాలను ఎదుర్కొన్నారు. రాజకీయంగా ఈ కేసు నష్టం చేసిందనే చెప్పాలి. కవితను బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.

ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న కవితకు ఈ కేసులో క్లీన్ చిట్ రావడం పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు. తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత రాజకీయ పార్టీకి రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో దిల్లీ లిక్కర్ కేసులో నిర్దోషిగా బయటపడ్డారు. దాదాపు ముడేళ్లపాటు ఈ కేసు కొనసాగింది.

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏంటి?

అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు దిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్‌లో కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో అవకతవకలు, స్కామ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. పెద్ద ఎత్తున విమర్శల పాలైంది ప్రభుత్వం. దీంతో దిల్లీ సర్కార్ 2022 సెప్టెంబర్‌లో పాలసీని వెనక్కు తీసుకుంది. కానీ అప్పటికే లైసెన్సుల కేటాయింపులు, ఎక్సైజ్ పాలసీ సవరణలో భారీ అక్రమాలు జరిగాయని, ఆప్ నేతలు, మరికొందరు మనీలాండరింగ్‌కు పాల్పడినట్టుగా సీబీఐ, ఈడీ ఆరోపణలు చేశాయి.

లైసెన్స్‌దారులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం చేకూర్చినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం నిందితులు భారీగా డబ్బులు తీసుకున్నారని సీబీఐ, ఈడీ ఆరోపించింది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నేతలతోపాటుగా కల్వకుంట్ల కవితను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జైలు శిక్ష తర్వాత బెయిల్ మీద విడుదల అయ్యారు. తాజాగా ఈ కేసులో 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు.