పట్టణ ప్రాంతాల్లో పేదలకు గుడ్‌న్యూస్.. 18,213 ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

PMAY Urban 2.0 : ప్రధానమంత్రి ఆవాస యోజన(పీఎంఏవై.యూ) అర్బన్ 2.0 పథకం కింద తెలంగాణలోని 118 పట్టణ ప్రాంతాల్లో 18213 ఇళ్లను నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఓకే చెప్పింది.

Published on: Mar 11, 2026 5:44 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పేదల గృహ నిర్మాణాలకు ఊతం ఇచ్చేలా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ఇళ్ల నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రం సరే అని చెప్పిందని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు
పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు

రాష్ట్ర ప్రతిపాదమకు ఆమోదం తెలుపుతూ.. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వాటా కింద రాష్ట్రానికి మంజూరు కావాల్సిన రూ.273 కోట్ల నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. పీఎంఏవై అర్బన్‌ 2.0 పథకంపై ఢిల్లీలో నిర్వహించిన సెంట్రల్‌ శాంక్షనింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.

తెలంగాణలో ప్రస్తుతం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం ఇంటిని మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణానికి దశలవారీగా రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఇందులో భాగంగా 118 పట్టణ ప్రాంతల్లో రూ.910.65 కోట్ల అంచనా వ్యయంతో 18213 ఇళ్లను నిర్మించాలని తెలంగాణ ప్రతిపాదన చేసింది. ఇందులో కేంద్రం వాటా రూ.273 కోట్లు. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ కార్పొరేషన్ దృష్టిపెట్టింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధుల మంజూరు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించుకోవాలనుకున్న పేదలకు ఇది శుభవార్త అవుతుంది. కేంద్రం నిధులు సమకూరుస్తుండటంతో ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. త్వరలోనే ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో అమల్లోకి వస్తాయి.

ఏప్రిల్ 1 నుంచి మంజూరు

ఏప్రిల్ 1 నుంచి రెండోదశ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం కానుంది. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. మొదటి దశలో రాష్ట్రమంతటా గ్రౌండింగ్ కాని (20 శాతం) లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సూచనల మేరకు మార్చి 31 నాటికి లక్ష ఇండ్ల గృహ ప్రవేశాలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

'ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచిత ఇసుక సరఫరా చేస్తోంది. లబ్ధిదారులకు ఇసుక లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో బ్రిక్ యూనిట్లు, ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు యూనిట్లు ఏర్పాటు చేయాలి. నిర్మాణ సామాగ్రి ధరల భారం లబ్ధిదారులపై పడకుండా జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు చురుగ్గా పని చేయాలి.' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాక ఒకటి లేదా రెండు విడతల్లో చెల్లింపులు జరిగిన తరువాత... వివిధ కారణాలతో చెల్లింపులు ఆగిపోతే వెంటనే క్లియర్ చేయాలని మంత్రి ఆదేశించారు. తక్షణమే క్లియర్ చేయకపోతే అధికారులపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. రెండో దశలో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More