నిజామాబాద్ జిల్లాలో రూ. 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు - సీఎం రేవంత్ శంకుస్థాపన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. రూ. 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లా అభివృద్ధికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తామని చెప్పారు.

Published on: Feb 06, 2026 9:25 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (ప్రతి పాఠశాలకు రూ. 200 కోట్ల చొప్పున) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. "ప్రజాపాలన – ప్రగతిబాట" కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు - సీఎం రేవంత్ శంకుస్థాపన
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు - సీఎం రేవంత్ శంకుస్థాపన

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ… తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రజలందరి సహకారం కావాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ వేదికగా ఇందూరు జిల్లా మహిళా సమాఖ్య (1614 స్వయం సహాయక సంఘాలు) కు రూ. 200 కోట్ల బ్యాంకు లింకేజీకి సంబంధించిన చెక్కును అందించారు.

“నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి మారుపేరు. ఇక్కడి వ్యవసాయం దేశానికే ఆదర్శం. ఈ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, అదనంగా నిధులు మంజూరు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తా. జిల్లా అభివృద్ధికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తా” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు:

  • రూ. 20 కోట్లతో తెలంగాణ యూనివర్శిటీ డిచ్‌పల్లిలో ఎస్సీ విద్యార్థినీ, విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణం.
  • గిరిజన సంక్షేమ శాఖ – ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందల్‌వాయిలో సిబ్బంది నివాస గృహాలు (స్టాఫ్ క్వార్టర్స్), అదనపు సౌకర్యాల నిర్మాణానికి సంబంధించిన పనులు.
  • ఆర్మూర్, బోధన్ మరియు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ YIIRS నిర్మాణం.
  • రూ. 8.60 కోట్లతో తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ నిర్మాణం.
  • అలాగే యూనివర్సిటీలో 1.36 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం. రూ. 43 కోట్ల అంచనా వ్యయంతో వర్సిటీ ఆడిటోరియం, పరిపాలనా భవనం, సీఎస్ఈ భవనాల విస్తరణ పనులు
  • రూ. 18 కోట్లతో చేపట్టిన యూనివర్సిటీ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం
  • రూ. 21 కోట్ల అంచనా వ్యయంతో నిజామాబాద్ జిల్లాలో గాంధీనగర్ నుండి బినోలా రోడ్డు వరకు (0/0 కి.మీ నుండి 5/8 కి.మీ), పీడబ్ల్యూడీ & జేఎన్‌ఎన్ రోడ్డు నుండి సిరన్‌పల్లి మీదుగా నిజాంపూర్ వరకు (0/0 కి.మీ నుండి 8/2 కి.మీ) రోడ్డు వెడల్పు పనులు.

“ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి మాట ఇస్తున్నా 2023 ఎన్నికల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా, మహేష్ కుమార్ గౌడ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినం. మళ్ళీ 2029లో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా, నేను ముఖ్యమంత్రిగా ఆనాడు డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ధర్మపురి శ్రీనివాస్ గారు రెండోసారి ఏ విధంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చినారో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరు కాదు వాళ్ళిద్దరిది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ బంధం విడదీయరానిదన్నారు. బీజేపీకి వేసినా, బీఆర్ఎస్ కు వేసినా ఆ ఓట్లు మూసీ నదిలో కలిపినట్టే అని వ్యాఖ్యానించారు.