మున్సిపల్‌ ఎన్నికల తర్వాత రైతు భరోసా.. లక్షలాది పేదలకు ఇళ్లు ఇస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురే లేదని, విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

Published on: Feb 04, 2026 7:23 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మిర్యాలగూడ మండలం గూడూరులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల తర్వాత రైతు భరోసా

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు వేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలోనే రైతులకు లక్షా 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం. 25 లక్షల 30 వేల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయ అప్పులు మాఫీ చేశాం. అప్పుల నుంచి రైతులను విముక్తి చేశాం. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన వెంటనే.. రైతు భరోసా డబ్బులు జమ చేస్తాం. ఇందుకోసం 9 వేల కోట్ల రూపాయు ఖర్చు అవుతుంది. ఈ 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో నేరుగా వేస్తాం.' అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

సన్న బియ్యం ఇస్తున్నాం

వరి పండిస్తే గిట్టుబాటు ధరతోపాటు 500 రూపాయల బోనస్ ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని సీఎం రేవంత్ అన్నారు. రేషన్ కార్డుల కోసం గతంలో పది సంవత్సరాలు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చేదన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 3.17 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. సన్న బియ్యం వచ్చినవారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

వరి ఉత్పత్తిలో మిర్యాలగూడ ఆసియాలోనే ముందు ఉందని సీఎం రేవంత్ అన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీఫాం మీద పోటీ చేస్తున్న ఆడబిడ్డలకు కూడా ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించామన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా వివక్ష చూపలేదని చెప్పారు.

లక్షలాది ఇళ్లను పేదలకు ఇస్తాం

'ఏప్రిల్‌ నెలలో కొత్త బడ్జెట్‌లో లక్షలాది ఇళ్లను పేదలకు ఇస్తాం. పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత మేం తీసుకుంటాం. నల్గొండ జిల్లా మీద ఉన్న కోపంతో ఎస్ఎల్‌బీసీని పక్కనపెట్టారు. ఎస్ఎల్‌బీసీ ఆగిపోతే మామా, అల్లుళ్లు దావత్ చేసుకున్నారు. నల్గొండ జనాలు ఫ్లోరైడ్ నీరు తాగడానికి కారణం బీఆర్ఎస్ పార్టీనే. రెండేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ఎస్ఎల్‌బీసీ పనులను మెుదలుపెట్టాం.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత

పెండ్లం మొగుడి మాటలు రహస్యంగా విన్నారని, ఇలాంటోళ్లకు నోటీసులు ఇస్తే గగ్గోలు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నీకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టా అని ప్రశ్నించారు. అలా అయితే నీ ఆస్తులు తెలంగాణ ప్రజలకు రాసి ఇవ్వు అని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలు దోచుకుని, పెండ్లం మెుగుడి మాటలు రహస్యంగా వినేవాల్లు జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా తెలంగాణ దేవత అన్నారు. శ్రీకాంతాచారి తల్లికి బీఆర్ఎస్ పాలకులు పదవి కూడా ఇవ్వలేదన్నారు.