పోలీసులు అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదని వారి సేవలను కొనియాడారు. ఇవాళ గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలు పెరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తోందన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయని… ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు ఎదుర్కొనే విధంగా సిద్ధం కావాలని సూచించారు.
జనజీవన స్రవంతిలోకి రండి - సీఎం రేవంత్
మావోయిస్టుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని గుర్తు చేశారు. అయితే ఇంకా అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని… ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు వారి ఆలోచనలను కూడా పంచుకోని… ప్రజాస్వామ్య పద్ధతిలో పని చేసేందుకు ముందుకు రావాలన్నారు.
నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రమోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారి కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్ గ్రేషియాతో పాటు ఇంటి స్థలం మంజూరు చేస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.