TG Cheyutha Pension Scheme : ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కొత్త పింఛన్లు - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Telangana Cheyutha Pension Scheme : చేయూత పథకం కింద కొత్త పెన్షన్లపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హుల గుర్తింపు ప్రక్రియ వెంటనే చేపట్టాలన్నారు. కొత్తగా  థలసీమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు వీటిని మంజూరు చేయాలన్నారు.

Published on: Jul 31, 2026, 07:22:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని త‌ల‌సేమియా, సికిల్‌సెల్ అనీమియా బాధితులంద‌రికీ పింఛ‌న్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి ఈ ప్ర‌క్రియ‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని చెప్పారు. ఆగ‌స్టు 15వ తేదీ నుంచి పింఛ‌న్లు పంపిణీ చేయాల‌ని ఆదేశించారు. బాధిత కుటుంబాల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు పింఛ‌న్లు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని అన్నారు.

ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కొత్త పింఛన్లు
ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కొత్త పింఛన్లు

జాప్యం ఉండొద్దు - సీఎం రేవంత్

పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల‌పై మంత్రి సీతక్కతో క‌లిసి ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంట‌రి మ‌హిళ‌లు, నేత‌, గీత కార్మికులంద‌రికీ సంతృప్తిక‌ర స్థాయిలో పింఛ‌న్లు (పెన్షన్లు) మంజూరు చేయాల‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయిన‌ప్పుడు వారి భార్య‌ల‌కు త‌క్ష‌ణ‌మే పింఛ‌న్లు ఇవ్వాల‌న్నారు. ఈ విష‌యంలో ఎటువంటి జాప్యానికి తావివ్వద్ద‌న్నారు.

మండ‌ల స్థాయిలో అన్ని శాఖ‌ల ప‌రిధిలో చేప‌ట్టే అభివృద్ధి ప‌నుల‌ను ఎంపీడీవోలు ప‌ర్య‌వేక్షించేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 45 రోజుల‌కు ఒక‌సారి మండ‌ల ప‌రిష‌త్తు స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని, స‌మావేశాల‌కు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను ఆహ్వానించాల‌ని సూచించారు.

స‌ర్పంచులు త‌మ గ్రామ స‌మ‌స్య‌ల‌ను అధికారుల దృష్టికి తీసుకువ‌చ్చేందుకు ఈ స‌మావేశాలు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని అన్నారు. రాష్ట్రంలోని తారు రోడ్డులేని గ్రామం ఉండ‌కూడదని స్పష్టంగా చెప్పారు. ప్ర‌తి గ్రామానికి తారు రోడ్డు నిర్మించాల‌ని, ప్ర‌తి పంచాయ‌తీకి కార్యాల‌యం నిర్మించాల‌ని ఆదేశించారు.

పంచాయతీలోని జ‌నాభా ఆధారంగా ఏ, బీ, సీలుగా వ‌ర్గీక‌రించి భ‌వ‌నాలు నిర్మించాల‌న్నారు. కార్య‌ద‌ర్శులు పారిశుద్ధ్య ప‌నులు, ఇత‌ర అంశాల‌పై పూర్తి స్థాయిలో బాధ్య‌త వ‌హించేలా చూడాల‌ని తెలిపారు. రాష్ట్రంలో వివిధ కార‌ణాల‌తో ఎన్నిక‌లు జ‌ర‌గ‌ని పంచాయ‌తీల‌కు పారిశుద్ధ్య‌, ఇత‌ర ప‌నుల‌కు ఆటంకం లేకుండా వెంట‌నే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

కోటి మంది మ‌హిళ‌ల‌కు పంపిణీ చేసే చీర‌లు పూర్తి నాణ్య‌త‌తో, ఆక‌ట్టుకునే డిజైన్ల‌లో ఉండాల‌ని చెప్పారు. డిజైన్ల రూప‌క‌ల్ప‌న‌కు ఎన్ఐఎఫ్‌టీ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాల‌ని తెలిపారు. ఇందిర‌మ్మ చీర‌లకు మ‌హిళ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చినందున‌… నాణ్య‌త‌, రంగుల విష‌యంలో రాజీప‌డొద్ద‌ని సూచించారు.

ఎల్‌నినో నేప‌థ్యంలో తాగునీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో పంచాయతీల్లో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. గ్రామీణ తాగునీటి స‌ర‌ఫ‌రా, హైద‌రాబాద్ మెట్రో వాట‌ర్‌, నీటి పారుద‌ల శాఖ అధికారులు స‌మ‌న్వ‌యంతో స‌మావేశాలు నిర్వహించుకోవాల‌న్నారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచించారు.

గ్రామీణ తాగునీటి ప‌థ‌కాల ప‌రిధిలో ప‌ని చేసే వారికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అయిదో తేదీలోపు వేత‌నాలు ఇవ్వాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్థానిక వ‌న‌రుల ఆధారంగానే తాగునీటి సరఫరాకు ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని చెప్పారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More