హైదరాబాద్‌లో జూన్ 14వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన.. ఎందుకు అంటే?

పరీక్షలకు సంబంధించిన లోపాలపై దిల్లీలో విజయవంతంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు పలు నగరాల్లో కూడా ప్లాన్ చేసింది. అందులో భాగంగా జూన్ 14వ తేదీన హైదరాబాద్‌లో నిరసన వ్యక్తం చేయనుంది.

Published on: Jun 11, 2026, 17:18:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పరీక్షలకు సంబంధించిన లోపాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ, న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. వారం రోజుల తర్వాత ఆ పార్టీ దేశవ్యాప్తంగా వరుస శాంతియుత నిరసన కార్యక్రమాలను ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కూడా నిరసన జరగనుంది.

హైదరాబాద్‌‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన
హైదరాబాద్‌‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన

తాజాగా సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 11, జూన్ 20 మధ్య ఏడు నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం జూన్ 14న ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ వద్ద జరుగుతుంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల పేపర్ లీకేజీలు, సీబీఎస్‌ఈ మార్కింగ్ విధానంలో అవకతవకలపై దేశ రాజధాని దిల్లీలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సోషల్ మీడియా వేదికగా పురుడుపోసుకుని సరికొత్త వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆధ్వర్యంలో జూన్ 6న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన కార్యక్రమం జరిగింది. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుంటుందని, కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభీజిత్ దీప్కే నేతృత్వం వహించారు. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న ఆయన.. దేశంలోని విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై స్పందించి ప్రత్యేకంగా దిల్లీ చేరుకున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆత్మకథ పుస్తకాన్ని చేతబూని దిల్లీ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన ఆయన.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో శాంతియుత పద్ధతిలో జంతర్ మంతర్ వద్ద పోరాటాన్ని ప్రారంభించారు.

దిల్లీ పోలీసులు ఈ నిరసనకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కఠిన నిబంధనలతో కూడిన ఒకేసారి మినహాయింపు అనుమతి ఇచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత నడుమ ఈ ఆందోళన కొనసాగింది.

జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా పలు డిమాండ్లు చేశారు. పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. వరుస లోపాలతో విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌లో ఉన్న లోపాలను సరిదిద్ది పారదర్శకతను పెంచాలన్నారు.

నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్య అస్త్రాలు సంధించారు. 'మేము మిమ్మల్ని మేక్ ఇన్ ఇండియా అడిగితే.. మీరు మాకు 'లీక్ ఇన్ ఇండియా' ఇచ్చారు.' అంటూ రాసి ఉన్న పోస్టర్లు జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు దేశంలోని ముఖ్యమైన నగరాల్లోనూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు ప్లాన్ చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More