జూబ్లీహిల్స్ ఉపెన్నికలో హస్తం జెండా రెపరెపలాడింది. అనుకున్న విధంగానే భారీ మెజార్టీతో విజయఢంకాను మోగించింది. ఇకపై ఇదే స్పీడ్ ను స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చూపించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇక ఆలస్యం చేయకుండా… స్థానిక ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేసే పనిలో పడింది. కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది.
కేబినెట్ లో నిర్ణయం…

ఈనెల 17వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నవంబర్ 24లోగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో అన్ని అంశాలపై చర్చించి… ఎన్నికల వెళ్లే విషయంపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.
డిసెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం ప్రక్రియనే అదే నెలలో పూర్తి చేసేలా ప్రణాళికలు వేస్తోంది.
సమయం అసన్నమైనట్లేనా…?
తాజాగానే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వటమే కాక… మంచి మెజార్టీతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్న వాదనను తెరపైకి తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. అందుకు జూబ్లీహిల్స్ ఫలితాన్ని తెరపైకి తీసుకువస్తోంది. ఇదే విషయాన్ని పలువురు మంత్రులు, ముఖ్య నేతలు కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ…. ఇక ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో… ఇకపై ఆలస్యం కాకుండా ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా భావిస్తోంది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9 అమలును హైకోర్టు నిలిపివేయటంతో ప్రభుత్వపరంగా ఈ నిర్ణయం అమలుకు ఇబ్బందులు ఉన్నాయి. అయితే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామనే ప్రకటన కాంగ్రెస్ నుంచి రావొచ్చన్న వాదనలు, విశ్లేషణలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. దాదాపు ఇదే నిర్ణయాన్ని ప్రకటించి… కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంపై కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్లో రబీ సీజన్ ప్రారంభానికి ముందు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా నిధులను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. పాజిటివ్ వాతావరణంలో ఎన్నికలకు వెళ్లి… క్షేత్రస్థాయిలో మరింత బలపడాలని హస్తం అధినాయకత్వం ఆలోచిస్తోంది…! అన్ని కుదిరితే కేబినెట్ భేటీ తర్వాత.. ఏ క్షణంలోనైనా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}మరోవైపు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంపై కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్లో రబీ సీజన్ ప్రారంభానికి ముందు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా నిధులను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. పాజిటివ్ వాతావరణంలో ఎన్నికలకు వెళ్లి… క్షేత్రస్థాయిలో మరింత బలపడాలని హస్తం అధినాయకత్వం ఆలోచిస్తోంది…! అన్ని కుదిరితే కేబినెట్ భేటీ తర్వాత.. ఏ క్షణంలోనైనా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}