తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు : మొదటి విడత ఫలితాల్లో ‘కాంగ్రెస్’ మద్దతుదారుల హవా..!

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో అధికార కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే అత్యధికంగా గెలిచారు. ఆ తర్వాత స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. కొన్నిచోట్ల మాత్రమే బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారు.

Published on: Dec 11, 2025 7:15 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ముందు వరుసలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవగా… కొన్నిచోట్ల బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. మరికొన్నిచోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ఓట్ల లెక్కింపు
ఓట్ల లెక్కింపు

ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు…

ఇవాళ జరిగిన పోలింగ్‌లో 3,834 సర్పంచ్ పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడ్డారు. సాయంత్రం 6 గంటల నాటికి రిపోర్ట్స్ ప్రకారం…. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు 750కిపైగా గ్రామాల్లో విజయం సాధించారు. ఇక 350 పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవగా…. ఇండిపెండెంట్ అభ్యర్థులు 180కిపైగా చోట్ల విజయం సాధించారు. ఇక బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 70కిపైగా గ్రామాల్లో సర్పంచ్ పీఠం దక్కించుకున్నారు.

ఏకగ్రవంగా ఎన్నుకున్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే 300కుపైగా ఉన్నారు. 40కిపైగా చోట్ల బీఆర్ఎస్, కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఇతరులు 39 చోట్ల పోటీ లేకుండా సర్పంచలుగు ఎన్నికయ్యారు.

ఎన్నికలు జరిగిన వాటితో పాటు ఏకగ్రీవమైన వాటితో కలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 1100 స్థానాల్లో పీఠం దక్కించుకున్నారు. బీఆర్ఎస్ ఖాతాలోకి 500కిపైగా, బీజేపీ ఖాతాలోకి 90కిపైగా వెళ్లాయి. 200కిపైగా స్థానాల్లో ఇతరులు గెలిచారు.

లెక్కింపు సరళిని బట్టి పలు జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే అధిక్యంలో ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. కొన్నిచోట్ల రీకౌంటింగ్ కూడా జరుగుతున్నాయి. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా… పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితులను చక్కదిద్దారు. అర్ధరాత్రిలోపే అన్ని పంచాయతీల ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.

సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగవు. కానీ రాజకీయ పార్టీలు అభ్యర్థులను బలపరుస్తుంటాయి. వాటి ఆధారంగానే ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారనే దానిపై అంచనాకు రావొచ్చు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 14వ తేదీన నిర్వహిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇక చివరి విడత ఎన్నికలు డిసెంబర్ 17వ తేదీన ఉంటాయి. దీంతో పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత… ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.