Danam Disqualification Case : అనర్హత వేటు తీర్పు - సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

Danam Nagender Disqualification Case : ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవిపై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఎల్లుండి విచారణ జరిగే అవకాశం ఉంది.

Published on: Sep 19, 2026, 20:47:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Danam Nagender Disqualification Case : తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఖైరతాబాద్ శాసనసభ్యుడి అనర్హత వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత నాయస్థానమైన సుప్రీంకోర్టుకు చేరింది. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి…. అనంతరం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు తాజాగా అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఈ కీలక తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దానం నాగేందర్‌
దానం నాగేందర్‌

తనపై హైకోర్టు విధించిన అనర్హత తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ (SLP) దాఖలు చేశారు. శాసనసభ స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం తనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించడంపై ఆయన న్యాయపరమైన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అత్యవసర ప్రాతిపదికన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని దానం న్యాయవాదులు కోరినట్లు తెలిసింది. ఈ పిటిషన్‌పై ఎల్లుండి (సోమవారం) సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది.

కేసు నేపథ్యం ఏమిటంటే….?

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే, మార్చి 2024లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన 2024 సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే మరో పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం పార్టీ మారినట్లేనని, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

అయితే….స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ ఈ అనర్హత పిటిషన్లను తోసిపుచ్చడంతో, సదరు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. వేరొక పార్టీ బి-ఫారమ్‌పై పోటీ చేసిన ఆధారాలు స్పష్టంగా ఉన్నందున 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని… ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లేనని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అంతేకాకుండా, ఈ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు వీలుగా గడువు ఇవ్వాలన్న దానం లాయర్ల విజ్ఞప్తిని కూడా హైకోర్టు నిరాకరించింది.

సుప్రీంకోర్టు విచారణపై తీవ్ర ఉత్కంఠ

హైకోర్టు తీర్పును వెంటనే అమలు కాకుండా దానం నాగేందర్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఒకవేళ సుప్రీంకోర్టు…. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వకపోతే, ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించడం లేదా ఎన్నికల సంఘం తదుపరి చర్యలు వేగవంతం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా… బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన మరికొందరు ఎమ్మెల్యేల భవిష్యత్తు కూడా ఈ కేసు విచారణపైనే ఆధారపడి ఉండటంతో, సుప్రీంకోర్టులో త్వరలో జరగబోయే విచారణపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More