Medaram Maha Jathara : గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు - మేడారంలో భక్తజన సందోహం

మేడారంలోని గద్దెలపై వనదేవతలు కొలువుదీరారు. గురువారం సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో జాతరలో అత్యంత కీలక ఘట్టం పూర్తయింది. ప్రస్తుతం గద్దెలపై వనదేవతలు కొలువుదీరగా…. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Published on: Jan 30, 2026 12:11 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మేడారం జాతర అత్యంత వైభవంగా సాగుతోంది. జాతరలో అత్యంత కీలమైన వనదేవతల రాక పూర్తయింది. ప్రస్తుతం గద్దెలపై వనదేవతలు కొలువుదీరారు. గురువారం సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో అత్యంత కీలక ఘట్టం పూర్తయింది. ప్రస్తుతం గద్దెలపైన ఉన్న వనదేవతలను భక్తులు భారీగా దర్శించుకుంటున్నారు. ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు.

మేడారం
మేడారం

గురువారం సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి మేడారానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్యం, సిద్దబోయిన మునిందర్, సిద్దబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్ధన్ ఆధ్వర్యంలో చిలుకల గుట్ట పైకి చేరుకొని సమ్మక్క తల్లికి దీపధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర మంత్రులు అనసూయ(సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివకర టి. ఎస్, జిల్లా ఎస్. పి సుధీర్ రాంనత్ కేకన్ గిరిజన సంప్రదాయాలతో పూజలు నిర్వహించారు. అనంతరం మూడంచెల భద్రత మధ్య గన్ ఫైరింగ్ తో చిలకలగుట్టలో రాత్రి 6.55 గంటలకు మేడారంకు సమ్మక్క తల్లి బయలుదేరి మేడారం గద్దెలపైకి చేరుకుంది.

అశేష భక్తజనం….

దీంతో మేడారం మహా జాతరలో ప్రధానఘట్టం ఆవిష్కృతం అవ్వడంతో భక్తులు పులకించిపోయారు. చిలకల గుట్ట నుంచి ఆలయ ప్రాంగణం వరకు అశేష భక్తజనం సమ్మక్క తల్లికి నీరాజనాలు పలికారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిండు వెన్నెల వెలుగుల్లో సమ్మక్క తల్లిని గద్దెపై పూజారులు ప్రతిష్ఠిస్తారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలు మేడారం గద్దెలపై కొలువు తీరాయి.

ఇవాళ మేడారానికి అత్యధిక స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. ఈ మేరకు అధికారులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగు కుంభమేళను తలపిస్తోంది. ఇక జనవరి 31వ తేదీన దేవతల వన ప్రవేశంతో మేడారం మహాజాతర ముగుస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీన తిరుగువారం పండుగ నిర్వహిస్తారు.

మేడారం జాతర లైవ్ ఇక్కడ చూడండి…..