LPG : 11 నెలల్లో పీఎంయూవై కింద తెలంగాణలో ఎన్ని ఎల్పీజీ కనెక్షన్లు తీసుకున్నారో తెలుసా?

LPG Connections : దేశంలో ఎల్పీజీపై ఇప్పటికీ చాలా మంది ఆందోళనగానే ఉన్నారు. కమర్షియల్ మాత్రమే కాదు.. డొమెస్టిక్ ఎల్పీజీ కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రభావం చూపించింది. ఇలాంటి సమయంలో తెలంగాణలో గత 11 నెలల్లో ఎన్ని ఎల్పీజీ కనెక్షన్లు తీసుకున్నారో చెప్పింది కేంద్రం.

Published on: Mar 24, 2026, 15:00:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత 11 నెలల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద తెలంగాణలో 51,112 కొత్త ఎల్పీజీ కనెక్షన్లను భారత ప్రభుత్వం కల్పించిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభకు తెలిపారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. గత నాలుగేళ్లలో ఏ ఏడాదిలోనూ లేనంతగా ఈ కాలంలో కనెక్షన్ల పంపిణీ ఎక్కువగా ఉందని కేంద్రమంత్రి తెలిపారు.

ఎల్పీజీ కనెక్షన్లు
ఎల్పీజీ కనెక్షన్లు

PMUY పథకం ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల వంటచెరకు వంటి సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం తగ్గడంతో పాటు ఆరోగ్యం, పర్యావరణ ఫలితాలు కూడా మెరుగుపడతాయని కేంద్రం భావిస్తోంది

చర్చ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్

మరోవైపు తెలంగాణలో వంటగ్యాస్ కొరతపై శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ తక్షణమే చర్చ జరపాలని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) శాసనసభ పక్షం డిమాండ్ చేసింది. ఈ కొరత సామాన్య ప్రజలను, చిన్న వ్యాపారులను, పలు సంస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నందున, ఈ సమస్యను తక్షణమే చేపట్టాలని కోరుతూ వాయిదా తీర్మానాలను సమర్పించినట్లు పార్టీ తెలిపింది.

సకాలంలో గ్యాస్ సరఫరా లేకపోవడం వల్ల గృహాలు వంట చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అదే సమయంలో చిన్న వ్యాపారాలు, హోటల్ నిర్వాహకులు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.

వృద్ధాశ్రమాలు, హాస్టళ్లు, ఇలాంటి సంక్షేమ సంస్థలు కూడా నివాసితులకు ఆహారం తయారు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ కోరింది. ప్రజలకు మరింత ఇబ్బంది కలగకుండా నివారించడానికి తక్షణ జోక్యం అవసరమని పేర్కొంది. ఈ విషయాన్ని శాసనసభలో ఆలస్యం లేకుండా చర్చించాలని, గ్యాస్ పంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనం ఉండాలని నొక్కి చెప్పింది.

ఎల్పీజీ కొరత లేదు : సజ్జనార్

హైదరాబాద్ నగరంలో ఇంధనం లేదా ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో సజ్జనార్ మాట్లాడుతూ.. తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, నగరం అంతటా సరఫరా సజావుగా సాగుతోందని చెప్పారు.

'ప్రజలు భయాందోళనలకు గురికావద్దు. ఇంధన కేంద్రాల వద్ద తొందరపడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అలా చేస్తే.. అనవసరమైన రద్దీ, అంతరాయాలకు దారితీస్తుంది.' అని సజ్జనార్ అన్నారు.

సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో హైదరాబాద్ నగర పోలీసులు ఎల్పీజీకి సంబంధించిన పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని, వదంతులను వ్యాప్తి చేయడం లేదా తప్పుడు మాటలను నమ్మడం మానుకోవాలని, సాధారణ పరిస్థితులు కొనసాగేలా అధికారులకు సహకరించాలని కోరారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More