Telangana : మార్చురీ లోపల శవాన్ని పీక్కుతిన్న కుక్క.. నలుగురు సస్పెన్షన్

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో దారుణమైన ఘటన జరిగింది. మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్నది. ఈ ఘటనలో నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది.

Published on: Mar 03, 2026 4:32 PM IST
By , Jadcherla
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ.. ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ నిర్ణయం తీసుకున్నారు. విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన తెలంగాణలోని జిల్లా ఆసుపత్రులలో వైఫల్యాలను హైలైట్ చేస్తుందని పలువురు విమర్శలు చేస్తున్నారు.

మార్చురీ లోపల శవాన్ని పీక్కుతిన్న కుక్క
మార్చురీ లోపల శవాన్ని పీక్కుతిన్న కుక్క

ఈ ఘటనకు సంబంధించిన వివరాళ్లోకి వెళ్తే.. భీమేష్ అనే వ్యక్తి ఒక రోజు ఉదయం నాగసాల గ్రామంలోని తన ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కొన్ని రోజుల తర్వాత అతని మృతదేహం జడ్చర్ల మండలంలోని ఒక చెరువు నుండి బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. తర్వాత అతడి మృతదేహం మార్చురీకి తరలించారు.

అయితే జడ్చర్ల ఏరియా ఆసుపత్రి మార్చురీ సిబ్బంది మృతదేహాన్ని తీసుకెళ్లి నేలపై ఉంచారు. స్ట్రెచర్ మీద పెట్టలేదు. అంతేకాదు మార్చురీకి సరైన తలుపు లేక కుక్కలు ప్రవేశించి శవాన్ని పీక్కుతిన్నాయి. ఆ మార్చురీలో ఫ్రీజర్ యూనిట్లు పనిచేయడం లేదు. మృతదేహం రావడంతో సిబ్బంది నేలపై వదిలేశారు.

ప్రభుత్వ ఆసుపత్రి ఒక మృతదేహాన్ని తీసుకుని, భద్రపరచడం, తర్వాత అంత్యక్రియలకు సరైన స్థితిలో కుటుంబానికి తిరిగి ఇవ్వడం బాధ్యత. కానీ ఇవేమీ జడ్చర్లలో కనిపించలేదనే విమర్శ ఉంది. ప్రత్యక్ష సాక్షులు వీడియో తీశారు. ఈ సంఘటన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తెలంగాణ ఆరోగ్య మంత్రి స్పందించారు. 'జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆసుపత్రిని సందర్శించి విచారణ ప్రారంభించారు.' అని ఒక ప్రకటన వెలువడింది.

మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు, ప్రత్యక్ష సాక్షులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నుండి వాంగ్మూలాలు సేకరించారు అజయ్ కుమార్. ఈ సంఘటనలో నిర్లక్ష్యం, వారి పాత్ర కారణంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళ, డ్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ హరినాథ్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ మునిషా, మార్చురీ సపోర్టింగ్ స్టాఫ్ సభ్యుడు రవి ప్రకాష్‌లను సస్పెండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు.

తెలంగాణ అంతటా జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులు మార్చురీ కోల్డ్ స్టోరేజ్‌లపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.