హైదరాబాద్‌లో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’.. ప్రారంభించిన యూఎస్ రాయబారి, భట్టి

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ పక్క రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రోడ్డు నామకరణ ఫలకాన్ని యూఎస్ రాయబారి సెర్గియో గోర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంయుక్తంగా ఆవిష్కరించారు.

Published on: Jun 23, 2026, 20:08:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ మరో అంతర్జాతీయ మైలురాయికి వేదికైంది. అమెరికా దేశ 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (ఫ్రీడమ్ 250) పురస్కరించుకుని నగరంలో ఘనంగా గాలా రిసెప్షన్ నిర్వహించారు. ఈ చారిత్రాత్మక వేడుకలో భాగంగా గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ పక్కనే ఉన్న రహదారిని ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అధికారిక ఫలకాన్ని ఆవిష్కరించారు. భారత్‌లో యూఎస్ రాయబారి సెర్గియో గోర్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంయుక్తంగా ఈ ప్లాక్‌ను ఆవిష్కరించి, ఇరు దేశాల బంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.

హైదరాబాద్‌లో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’..
హైదరాబాద్‌లో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’..

ఇరు దేశాల ప్రముఖుల సమక్షంలో ఘనంగా వేడుకలు

ఈ వేడుకకు పలువురు సీనియర్ దౌత్యవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వ్యాపార, ఏరోస్పేస్, రక్షణ, సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అమెరికా జాతీయ ఆర్థిక, భద్రతా ప్రాధాన్యతలతో పాటు పారిశ్రామిక రంగంలో తెలంగాణ లీడర్‌షిప్‌ను ఈ సందర్భంగా కొనియాడారు. అమెరికా రాయబారి సెర్గియో గోర్, యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌తో కలిసి ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని వేడుకగా జరుపుకున్నారు. హైదరాబాద్ వేదికగా అమెరికా-భారత్ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయనడానికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ నామకరణమే నిదర్శనమని నేతలు అభిప్రాయపడ్డారు.

‘అమెరికా ఫస్ట్’ అంటే ఒంటరిగా ఉండటం కాదు: సెర్గియో గోర్

హైదరాబాద్ కాన్సులర్ పరిధి ఇరు దేశాల వ్యూహాత్మక సహకారానికి నడిబొడ్డుగా మారిందని యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కొనియాడారు. "భారత్-అమెరికా భాగస్వామ్యం ఎంత వేగంగా దూసుకుపోతోందో చూడటానికి హైదరాబాద్ కంటే అద్భుతమైన ఉదాహరణ మరొకటి లేదు. హైటెక్ సిటీ నుంచి ఏరోస్పేస్, రక్షణ రంగాల వరకు ఈ ప్రాంతం సాధిస్తున్న ప్రగతి మా ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త వేగాన్ని ఇస్తోంది" అని ఆయన ప్రశంసించారు.

ట్రేడ్ అగ్రిమెంట్ గురించి ప్రస్తావిస్తూ..

"మా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం, మిషన్ ఇండియా ద్వారా అమెరికాలోకి 20 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కొత్త పెట్టుబడులు రాబోతున్నాయి. ‘అమెరికా ఫస్ట్’ అంటే అమెరికా ఒంటరిగా ఉండటం కాదని మేం నిరూపిస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ పేరు పెట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం మాకు గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఆశించే బలమైన, గౌరవప్రదమైన భాగస్వామ్యానికి ఈ నిర్ణయం అద్దం పడుతోంది" అని గోర్ కృతజ్ఞతలు తెలిపారు.

అమెరికాకు బలమైన వంతెన హైదరాబాద్: భట్టి విక్రమార్క

అమెరికా ప్రజలకు 250వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. యూఎస్-ఇండియా సంబంధాలలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని స్పష్టం చేశారు.

"అమెరికా 250 ఏళ్ల స్వేచ్ఛా ప్రస్థానాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో, భారత్‌ను అమెరికాతో అనుసంధానించే అత్యంత బలమైన వంతెనలలో ఒకటిగా హైదరాబాద్ నిలుస్తున్నందుకు గర్వపడుతున్నాం" అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

గ్లోబల్ ఫ్యూచర్‌ను శాసిస్తున్న ఆవిష్కరణలు

హైదరాబాద్‌లో కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న లారా విలియమ్స్ ప్రాంతీయ సాంకేతిక సహకారాన్ని కొనియాడారు.

"తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ఏరోస్పేస్, డిఫెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బయోఫార్మా రంగాలు ప్రపంచ భవిష్యత్తును రూపుదిద్దుతున్నాయి. ఈ వృద్ధికి అవసరమైన ప్రతిభ, సరికొత్త ఆలోచనలు ఇరు దేశాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగేలా చూసేందుకు మా కాన్సులేట్ నిరంతరం కృషి చేస్తుంది" అని లారా విలియమ్స్ స్పష్టం చేశారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More