మున్సిపల్ ఎన్నికలు.. తుది ఓటర్లు జాబితా విడుదల.. రిజర్వేషన్ల పరిస్థితేంటి?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. మరోవైపు రిజర్వేషన పరిస్థితేంటని చర్చ జరుగుతోంది.

Published on: Jan 13, 2026 5:16 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలు సంఘం ఏర్పాట్లపై దష్టిపెట్టింది. 2026 మున్సిపల్ ఎన్నికల కోసం వార్డులవారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు

ఇందులో 25,62,369 మంది పురుష ఓటర్లు, 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 640 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలు చూస్తే.. నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లు కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఉన్నారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉన్నారు. అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా 9,147 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.

సూర్యాపేట మున్సిపాలిటీలోనూ ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. 1,08,848 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 56,664 మంది మహిళలు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం అయింది. రిజర్నేషన్ల తర్వాత నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జనవరి 20వ తేదీ వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు.

రిజర్వేషన్లు ఫిక్స్ అయినట్టేనా?

వెనుకబడిన తరగతుల (బీసీ) డెడికేటెడ్ కమిషన్, తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించినట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని తెలుస్తోంది. మొత్తం 50 శాతం రిజర్వేషన్లలో, షెడ్యూల్డ్ కులాలు(ఎస్‌సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్‌టీ) రిజర్వేషన్లు కలిపి సుమారు 15 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది, మిగిలిన వాటాను వెనుకబడిన తరగతులకు కేటాయించాలని కమిషన్ సూచించినట్టుగా తెలుస్తోంది.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి తక్కువగా ఉన్నందున పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ కోటాను తగ్గించడాన్ని కమిషన్ సమర్థించుకుంది. ఈ నేపథ్యంలో మునిసిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీలకు కలిపి సుమారు 15 శాతం రిజర్వేషన్లను బీసీ డెడికేటెడ్ కమిషన్ ఖరారు చేసింది.

ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో మునిసిపాలిటీలకు వార్డుల వారీగా, చైర్‌పర్సన్ల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఉన్నాయి, ఇందులో బీసీల ప్రాతినిధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది. కమిషన్ నివేదికలోని సిఫార్సుల ఆధారంగా రిజర్వేషన్లను ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేయవచ్చని అంటున్నారు. అనంతరం తదుపరి చర్యల కోసం మునిసిపల్ పరిపాలన శాఖ తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపే అవకాశం ఉంది.