...
...
Next Story

హైటెక్ సిటీలో భారీ ఆఫీస్ లీజుకు తీసుకున్న ఫేస్‌బుక్.. నెలకు అద్దె ఎంతో తెలుసా?

హైదరాబాద్‌ హైటెక్ సిటీలోని 'స్కైవ్యూ 20' భవనంలో ఫేస్‌బుక్ ఇండియా దాదాపు 69,702 చ.అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకుంది. ఈ ఒప్పందం సమగ్ర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jan 9, 2026, 16:05:23 IST
Advertisement

గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మారుతున్న హైదరాబాద్‌పై దిగ్గజ సంస్థల నమ్మకం రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (ఫేస్‌బుక్ ఇండియా) హైటెక్ సిటీలో మరో భారీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకుంది. నగరంలోని ప్రైమ్ ఐటీ కారిడార్‌లో సుమారు 69,702 చదరపు అడుగుల స్థలాన్ని ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంటూ ఒప్పందం చేసుకుంది.

హైటెక్ సిటీలో భారీ ఆఫీస్ లీజుకు తీసుకున్న ఫేస్‌బుక్.. నెలకు అద్దె ఎంతో తెలుసా? (RMZ)
హైటెక్ సిటీలో భారీ ఆఫీస్ లీజుకు తీసుకున్న ఫేస్‌బుక్.. నెలకు అద్దె ఎంతో తెలుసా? (RMZ)

రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన పత్రాల ప్రకారం, ఫేస్‌బుక్ ఇండియా ఆన్‌లైన్ సర్వీసెస్ (మెటా అనుబంధ సంస్థ), మహంగా కమర్షియల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఈ లీజు ఒప్పందం కుదిరింది.

డీల్ వివరాలు ఇవే:

వేదిక: హైటెక్ సిటీలోని 'ద స్కైవ్యూ' కాంప్లెక్స్‌లో గల స్కైవ్యూ 20 భవనం నాలుగో అంతస్తులో ఈ ఆఫీస్ ఉండనుంది.

అద్దె, డిపాజిట్: ఈ ఆఫీస్ కోసం మెటా నెలకు సుమారు రూ. 67 లక్షల అద్దె చెల్లిస్తోంది. అలాగే, రూ. 4.01 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా జమ చేసింది.

కాలపరిమితి: జూలై 18, 2025 నుంచి ఐదేళ్ల పాటు ఈ లీజు అమల్లో ఉంటుంది. ఒప్పందం ప్రకారం, ప్రతి మూడేళ్లకు ఒకసారి అద్దె 15 శాతం పెరుగుతుంది.

వసతులు: ఈ ఆఫీస్ తో పాటు ఉద్యోగుల కోసం 70 కార్ పార్కింగ్ స్లాట్‌లను కేటాయించారు.

హైదరాబాద్‌పై ఫేస్‌బుక్ ప్రత్యేక మక్కువ

మెటా సంస్థకు హైదరాబాద్‌తో పాత అనుబంధమే ఉంది. గత ఏడాది (2024)లో కూడా ఇదే స్కైవ్యూ కాంప్లెక్స్‌లో దాదాపు 3.7 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ లీజును కంపెనీ పునరుద్ధరించుకుంది. ఆ సమయంలో నెలకు రూ. 2.8 కోట్ల అద్దె చెల్లించేలా ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు కొత్తగా తీసుకున్న స్థలంతో కలిపి హైదరాబాద్‌లో ఫేస్‌బుక్ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి.

బెంగళూరును వెనక్కి నెట్టిన హైదరాబాద్

అనుకూలతలు: నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సరసమైన ధరల్లో ఆఫీస్ స్పేస్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌కు వరంగా మారాయి.

పెరిగిన డిమాండ్: 2025 ఏడాదిలో హైదరాబాద్‌ ఆఫీస్ మార్కెట్ 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 11.4 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు వెళ్లడం గమనార్హం.

నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం, గోల్డ్‌మన్ సాక్స్, సర్వీస్ నౌ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ వంటి దిగ్గజాలు కూడా హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను వేగవంతం చేశాయి. కేవలం ఐటీ మాత్రమే కాకుండా ఫార్మా, బీఎఫ్ఎస్ఐ (BFSI), లైఫ్ సైన్సెస్ రంగాల్లో కూడా హైదరాబాద్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe