మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Published on: Feb 20, 2026 10:05 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పుడ్ పాయిజన్ అయినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే జీవన్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.

జీవన్ రెడ్డికి అస్వస్థత
జీవన్ రెడ్డికి అస్వస్థత

కొన్ని రోజులుగా మున్సిపల్ ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్నారు జీవన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఛైర్మన్ పదవి తన వర్గానికి చెందినవారికే రావాలని ప్రయత్నాలు చేశారు. ఎలక్షన్ బిజీలో పడి ఆయన సరిగా ఆహారం తీసుకోకపోవడం కూడా అస్వస్థతకు కారణంగా పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఎక్కువగా బయట తిరగడం కూడా జీవన్ రెడ్డి ఆరోగ్యంపై ప్రభావం పడింది.

జగిత్యాలలో కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నడుస్తోంది. ఇటు ఎమ్మెల్యే సంజయ్ వర్గం, అటు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఇదే మున్సిపల్ ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించింది. జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత లభించడం లేదనే వాదన బలంగా జనాల్లోకి వెళ్లింది. మెుదటి నుంచి పార్టీలో ఉన్న తనకు, తన వర్గానికి సరైన గౌరవం దక్కడం లేదని జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానంపై మరింత వివాదం చెలరేగింది.

పంచాయితీకి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఏఐసీసీ జీవన్ రెడ్డి, సంజయ్‌తో కీలక చర్చలు చేశారు. ఇటీవల మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ విడివిడిగా సమావేశం అయ్యారు. ప్రజా భవన్‌లోనే సవాంగ్‌ను కలిశారు. పార్టీ అంతర్గత విషయాలను రోడ్డుపైకి తీసుకురావడంతో కేడర్‌లో అయోమయం ఉందని ఇరువురి నేతలను హెచ్చరించింది అధిష్ఠానం.

కాంగ్రెస్ హైకమాండ్ జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య రెండు ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తోంది. మెుదటిది ఛైర్ పర్సన్ పీఠం సంజయ్ వర్గానికి, వైస్ ఛైర్మన్ పదవి జీవన్ వర్గానికి. అయితే రెండో ప్రతిపాదన.. చెరో రెండున్నర సంవత్సరాలు ఛైర్ పర్సన్ పీఠం పంచుకునేలా సూచించారు. జీవన్ రెడ్డి మాత్రం.. కాంగ్రెస్ జెండా మోసిన వారికే ఛైర్ పర్సన్ పీఠం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానం ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే దక్కింది. సంజయ్ నిలబెట్టిన సమిండ్ల వాణి ఎన్నికయ్యారు. అయితే జీవన్ రెడ్డి వర్గానికి వైస్ ఛైర్మన్ పదవి ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన వర్గానికి చెందిన జీనత్ ఫర్విన్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More