...
...
Next Story

ఆసుపత్రులకు వచ్చే వారికి ఫ్రీగా భోజనం, అటెండెంట్లకు డార్మెటరీలు, ఇతర వసతులు : సీఎం

ప్రభుత్వ వైద్యులు అదనపు సమయం సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సూచించారు.

Published on: Aug 18, 2026, 05:30:11 IST
Advertisement

రాబోయే ఏడాదిన్నర కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అల్వాల్ టిమ్స్‌, ఎల్‌బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లను వరుసగా ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రికి తీసిపోని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

MCRTIMS ప్రారంభోత్సవం
MCRTIMS ప్రారంభోత్సవం

హైదరాబాద్ సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(DrMCRTIMS)ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పలువురు ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

అనంతరం ఆసుపత్రి ఆవరణలో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్, వరంగల్ ఆసుపత్రిని అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి వేగంగా నిర్మాణాలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

'ఈ ఆసుపత్రులన్నీ పూర్తయితే రాష్ట్రంలో 10 వేల పడకల ఆసుపత్రులు పేదలకు అందుబాటులోకి వస్తాయి. తద్వారా రాష్ట్రంలోని పేదలకు ఒక విశ్వాసాన్ని ఇవ్వగలుగుతాం. ఎయిమ్స్‌తో పోటీపడే సేవలు అందిస్తున్న నిమ్స్ ఆసుపత్రికి ధీటుగా ఒక్కో ఆసుపత్రికి ఒక్కో డైరెక్టర్‌ను నియమించి వారి పర్యవేక్షణలో వీటిని తీర్చిదిద్దుతాం. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయడమే కాకుండా నిర్వహణలో ఏ కార్పొరేట్ ఆసుపత్రి తీసిపోని విధంగా నిర్వహిస్తాం.' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ ఆసుపత్రులకు వచ్చే వారికి ఉచితంగా భోజనం, అటెండెంట్లకు ఉండడానికి డార్మెటరీలు, ఇతర వసతులు కూడా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దానికి అవసరమైన నిధులు కేటాయించడమే కాకుండా సూపర్ పీజీని, నర్సింగ్‌ కాలేజీని కూడా ఇక్కడ మంజూరు చేయాలన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం అన్నారు. విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ సమూలమైన మార్పులు అందరికీ తెలిసిందే అని చెప్పారు. నర్సింగ్‌లో ఉన్న మహిళలు ఇప్పటివరకు మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే సేవలు అందిస్తున్నారని, భవిష్యత్తులో జర్మన్, జపనీస్, కొరియన్ భాషలను నేర్చుకుని ఆయా దేశాల్లో లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

ప్రభుత్వ వైద్యులు అదనపు సమయం సేవలు అందించాలన్నారు సీఎం. వారి నైపుణ్యాన్ని ఇతర ప్రదేశాల్లో ఉపయోగించే పరిస్థితి కాకుండా సర్జరీలు నిర్వహించినప్పుడు, ఇతరత్రా వారికి ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌లు ఇద్దామని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేసి ప్రజల్లో విశ్వాసం కల్పించాలని, కష్టమొచ్చినప్పుడు తమకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నదన్న భరోసా కల్పించాలన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe