...
...
Next Story

Health Profile : మహిళలకు 30 రకాల ఉచిత పరీక్షలతో హెల్త్ ప్రొఫైల్.. ఏ తేదీ నుంచి అంటే?

Health Profile : తెలంగాణలో 46 లక్షల మంది మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీకి రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. టీ డయాగ్నస్టిక్స్ ద్వారా ఒక్కొక్కరికీ 30 రకాల పరీక్షలు చేస్తారు.

Published on: Mar 5, 2026, 07:27:23 IST
Advertisement

రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాక సంఘాల మహిళల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రారంభించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సెక్రటేరియట్‌లో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణలో మహిళల హెల్త్ ప్రొఫైల్
తెలంగాణలో మహిళల హెల్త్ ప్రొఫైల్

ఈ సందర్భంగా ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకూ 99 రోజులపాటు చేపట్టనున్న కార్యక్రమాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు. హాస్పిటళ్లలో రోజువారీ వైద్య సేవలకు ఆటంకం కలగకుండా 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఉండాలని సూచించారు. అధికారులు రూపొందించిన ప్రణాళికను స్వల్ప మార్పులతో మంత్రి ఆమోదించారు. మొత్తం 4 దశల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

తొలి దశలో మార్చి 6 నుంచి 31వ తేదీ వరకు 26 రోజుల పాటు మాతా శిశు సంరక్షణ, కౌమార దశ బాలికలు, వృద్ధుల ఆరోగ్య సేవలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. హాస్పిటళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, ఆస్తుల వెరిఫికేషన్ వంటి పరిపాలనా పరమైన అంశాలను చక్కదిద్దడంతో పాటు.. క్షేత్రస్థాయిలో రక్తహీనత నివారణ, పాఠశాలలు, అంగన్‌వాడీల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపు మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సహకారంతో ఒక్కో మహిళకు మొత్తం 30 రకాల పరీక్షలు చేయనున్నారు. మార్చి 8 నుంచి మూడు దశల్లో సుమారు 46 లక్షల మంది మహిళలకు పరీక్షలు చేయనున్నారు. తొలి దశలో ప్రతి జిల్లా నుంచి 5 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, రెండో దశలో మరో 10 మండలాల్లో, చివరి దశలో మిగిలిన అన్ని మండలాల్లో స్క్రీనింగ్ చేపట్టనున్నారు. మొత్తం స్క్రీనింగ్‌ను 6 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు సాగే మూడో దశలో అంటువ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య సన్నద్ధతపై యంత్రాంగం దృష్టి సారించనుంది. టీబీ ముక్త్ భారత్ లక్ష్యంగా టీబీ కేసులను గుర్తించడంతో పాటు.. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వడదెబ్బ, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించి, అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు.

మే 16 నుంచి జూన్ 12 వరకు నాలుగో దశలో పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విస్తరించనున్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మేడ్చల్ పరిధిలోని 145 అర్బన్ పీహెచ్‌సీలను పాలిక్లినిక్స్‌గా అప్‌గ్రేడ్ చేసి, స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని మంత్రి రాజనర్సింహ సూచించారు. బస్తీల్లో మొబైల్ వెహికిల్స్‌ ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్యం చేరువ చేయనున్నారు. ఫుడ్ సేఫ్టీ మేళాలు నిర్వహించి ప్రజల్లో కల్తీ ఆహారంపై చైతన్యం తీసుకురావాలని మంత్రి సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe