జీహెచ్ఎంసీ : ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్, వాటర్ బిల్లుల కోసం కామన్ పే బిల్ యాప్
విద్యుత్, వాటర్, ఆస్తి పన్ను కోసం కామన్ పే బిల్ యాప్ను తీసుకురానుంది జీహెచ్ఎంసీ. కంబైన్డ్ పే బిల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని రెడీ అవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్, విద్యుత్ బిల్లులను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో చూసుకోవడానికి, చెల్లించడానికి అనుమతించే ఉమ్మడి బిల్లింగ్ వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికను అమలు చేయడానికి జీహెచ్ఎంసీ ట్యాక్స్ విభాగం సిబ్బంది, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్తో సమన్వయంతో, నగరం అంతటా ఇంటింటికీ సర్వేను ప్రారంభించారు. ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్యతో అనుసంధానించిన ఆస్తి యజమానుల మొబైల్ ఫోన్ నంబర్లను అధికారులు సేకరించి మ్యాపింగ్ చేస్తున్నారు.

ఆయా డిపార్ట్మెంట్ల మధ్య ఏకీకరణ కోసం హ్యాండ్హెల్డ్ పరికరాల ద్వారా డేటాను అప్లోడ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పోర్టల్లో మొబైల్ నంబర్ను నమోదు చేసిన తర్వాత ఆస్తి పన్ను, నీరు, విద్యుత్కు సంబంధించిన బిల్లులు కలిసి కనిపిస్తాయన్నమాట.
ఫిబ్రవరి 15 నాటికి సర్వేను పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారు. జనవరి 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం తర్వాత ఈ కీలక నిర్ణయం వైపు అడుగుపు పడుతున్నాయి. ఈ సమయంలో పౌర సేవల కోసం ఉమ్మడి బిల్లును ప్రవేశపెట్టే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులను కోరారు.
తదనంతరం మున్సిపల్ పరిపాలన విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారులతో చర్చలు జరిపి ఆస్తి పన్ను నంబర్లను విద్యుత్ మీటర్-లింక్డ్ ఫోన్ నంబర్లతో మ్యాప్ చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి పే బిల్ సేకరణలో పారదర్శకతను మెరుగుపరుస్తుందని, అక్రమాలను గుర్తించడంలో సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
అనేక సందర్భాల్లో వాణిజ్య, వ్యాపార భవనాలు ప్రస్తుతం.. నివాస ఆస్తి పన్ను రేట్లను చెల్లిస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీపై ప్రభావం పడుతుంది. గత సంవత్సరం నిర్వహించిన డ్రోన్ ఆధారిత భౌతిక సర్వేలో ఇటువంటి వ్యత్యాసాలు వెల్లడయ్యాయి. అన్ని భవనాల పూర్తి మ్యాపింగ్తో ఆస్తి పన్ను వసూళ్లు మూడు నుండి నాలుగు రెట్లు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
విద్యుత్, నీటి బిల్లులు నెలవారీగా చెల్లించబడుతున్నప్పటికీ జీహెచ్ఎంసీ ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలవారీ ఆస్తి పన్ను చెల్లింపులను అనుమతించదు. ఆస్తి పన్నును ఆరు నెలలకు ఒకసారి లేదా ఏటా చెల్లించాలి. ఇది ప్రారంభ దశలో పూర్తిగా ఏకీకృత చెల్లింపు ఆప్షన్ను పరిమితం చేస్తుంది. ప్రభుత్వ బిల్లు సౌకర్యాన్ని ప్రారంభంలో ఐచ్ఛికంగా ఆన్లైన్ ఫీచర్గా అందించవచ్చని, ప్రజల ప్రతిస్పందన ఆధారంగా మరిన్ని మార్పులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటర్, కరెంట్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి ఉందని యజమానులకు రిమైండ్ చేస్తుంది. ఇప్పటికే యాప్ సిద్ధమైందని అంటున్నారు.

E-Paper












