...
...
Next Story

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు మంచి స్పందన.. సుమారు రూ.83 కోట్ల ఆదాయం

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లకు మంచి స్పందన వచ్చింది. 85 ఓపెన్ ప్లాట్ల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించారు.

Published on: May 18, 2026, 22:19:05 IST
Advertisement

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది మంచి డిమాండ్‌తో ఫ్యూచర్ సిటీకి, అవుటర్ రింగ్ రోడ్‌కు సమీపంలో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలోని తొర్రూర్(66 ప్లాట్లు), కుర్మల్‌గుడ(11), బహదూర్‌పల్లి(8) ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన 85 ఓపెన్ ప్లాట్ల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించారు.

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం
రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం

పెద్ద అంబర్‌పేటలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బహిరంగ వేలంలో పాల్గొన్న బిడ్డర్లు చదరపు గజానికి నిర్దేశించిన దానికంటే అధిక మొత్తంతో ఈ ప్లాట్లను కొనుగోలు చేయడం విశేషం. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా సుమారు రూ.83 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి గౌతం తెలిపారు.

తొర్రూర్ లే అవుట్‌లో ప్లాట్‌ను కొనుగోలు చేయడానికి బిడ్డర్లు పోటీలు పడుతూ గరిష్టంగా చదరపు గజం స్థలాన్ని రూ.45,500కు వేలం పాటలో కొనుగోలు చేశారని ఎండి వి.పి.గౌతం తెలిపారు. ఓఆర్ఆర్, ఆదిభట్ల ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న తొర్రూర్‌లో 200 -700 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 66 ప్లాట్లకు చదరపు గజానికి కనీస ధర 25 వేల రూపాయలుగా నిర్దారించగా, సగటున రూ. 32,500 ధర పలికిందన్నారు. తమకు నచ్చిన భూముల కోసం పోటీ పడుతూ బిడ్డర్లు ఒక దశలో ప్లాట్‌ను దక్కించుకోడానికి దాదాపు ఇరవైసార్లు రేట్లు పెంచారంటే ఇక్కడి భూములకున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు.

అదే విధంగా ఎయిర్ పోర్టు, ఆర్సీఐకి దగ్గర్లో ఉన్న కుర్మల్‌గుడలో 200 నుంచి 400 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు చదరపు గజం కనీస ధర 20 వేల రూపాయలుగా నిర్ణయించగా, గరిష్టంగా రూ.27,500 ధర పలికింది. అవుటర్ రింగ్ రోడ్‌ను ఆనుకుని ఉన్న బహదూర్‌పల్లి ప్రాంతంలో 200 నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు కూడా మంచి ధర పలికింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe