'నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు' ప్రజెంటేషన్‌.. ప్రభుత్వంపై కేటీఆర్, హరీశ్ రావు సీరియస్ కామెంట్స్

తెలంగాణకు పదే పదే ద్రోహం చేసిన కాంగ్రెస్ నాయకులకు ఉరిశిక్ష విధించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీనేనని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

Updated on: Jan 4, 2026, 15:15:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నదీ జలాల సమస్యలు, పాలనపై అధికార పార్టీ తెలంగాణ ప్రజలను పదే పదే మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైనప్పటికీ, దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ నాయకులను ఉరితీయాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్, హరీశ్ రావు కామెంట్స్
కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్, హరీశ్ రావు కామెంట్స్

ఆదివారం తెలంగాణ భవన్‌లో 'నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు' అనే అంశంపై మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీలో మర్యాద కుప్పకూలిపోతోందని, సభానాయకుడిగా రేవంత్ రెడ్డి ప్రవర్తన ప్రమాణాలను దిగజార్చిందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాషను తీవ్రంగా వ్యతిరేకించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి, కరువు పీడిత ప్రాంతాలను మార్చిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి అధికారంలోంచి పుట్టిన అహంకారంతో సంయమనం లేక మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

'బేసిన్లు, నీటిపారుదల ప్రాజెక్టులు, ట్రిబ్యునళ్ల మధ్య తేడాను గుర్తించలేకపోవడంతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్‌పై అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తున్నారు. దివంగత ఎన్టీఆర్ చెప్పినట్టుగా కాంగ్రెస్ నాయకులు కుక్క మూతి పిందెలు. వట్టెం, సుంకిశాలకు నష్టం జరిగితే బాగు చేయలేదు. పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు.. తప్ప రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు.' అని కేటీఆర్ అన్నారు.

తెలంగాణకు ద్రోహం చేసినందుకు ఎవరైనా శిక్షించవలసి వస్తే, తెలంగాణను పదే పదే మోసం చేసినందుకు కాంగ్రెస్‌ను ఎన్నిసార్లు ఉరితీయాలి? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు ఉద్యోగాల కల్పన, వ్యవసాయ రుణమాఫీ, వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లపై కీలక హామీలను విస్మరించారని విమర్శించారు. అంతర్రాష్ట్ర నదీ జలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా చేస్తున్న ద్రోహం, కొనసాగుతున్న విదానాన్ని హరీష్ రావు ప్రజెంటేషన్ బయటపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు.

తెలంగాణకు విలన్ కాంగ్రెస్ : హరీశ్ రావు

తెలంగాణ భవన్‌లో సాగునీటి ప్రాజెక్టులపై మాజీ మంత్రి హరీశ్ రావు పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు మేలు చేసే ప్రాజెక్టులను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని హరీశ్ రావు అన్నారు.

'తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం అంతా ఇంతా కాదు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్సే. మన విద్యార్థులను పొట్టన పెట్టుకుంది, మన ప్రాజెక్టులను రద్దు చేసింది కాంగ్రెస్స్. చివరకు 11వ షెడ్యూల్‌లో కూడా పాలమూరు, దిండీ ప్రాజెక్టులను పెట్టకుండా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేసింది. తెలంగాణకు విలన్ కాంగ్రెస్సే.' అని హరీశ్ రావు అన్నారు.

కేసీఆర్ పదేళ్లపాటు అపరభగీరథుడిలా కష్టపడి నిర్మించిన ప్రాజెక్టులను ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని హరీశ్ రావు చెప్పారు. కాళేశ్వరంపై కక్ష పట్టారన్నారు. పాలమూరుపై పగపట్టారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన రిటైర్డ్ సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ రావు నీళ్లు-నిజాలు అనే పుస్తకం రాశారని హరీశ్ రావు గుర్తు చేశారు. అలాంటి నిపుణులతో సలహాలతో పాలమూరు-రంగారెడ్డికి, కాళేశ్వరానికి కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. అలాంటి ప్రాజెక్టులో మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగిపోతే.. మెుత్తం కాళేశ్వరం ప్రాజెక్టును పడుకోబెట్టారని కామెంట్స్ చేశారు హరీశ్ రావు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More