...
...
Next Story

మేడారం జాతర భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు ప్రారంభం.. రైడ్‌కు ఎంతంటే?

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వ గుడ్‌న్యూస్ చెప్పింది. హెలికాప్టర్ సేవలను ప్రారంభించింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Published on: Jan 22, 2026, 10:52:33 IST
Advertisement

మేడారం జాతర కోలాహలం మెుదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులు వనదేవతల దర్శనానికి వస్తున్నారు. ఎత్తుబంగారం సమర్పిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అనేక రకాల ఏర్పాట్లు చేసింది. టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. మరోవైపు హెలికాప్టర్ సేవల ద్వారా కూడా మేడారం వెళ్లవచ్చు. అంతేకాదు మేడారంలో ఏరియల్ వ్యూ కోసం కూడా హెలికాప్టర్ ఎక్కవచ్చు.

మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం
మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం

మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. జనవరి 22వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ దాకా ఈ సర్వీసులు కొనసాగుతాయి. హనుమకొండ నుంచి భక్తులు మేడారానికి హెలికాప్టర్‌లో వెళ్లవచ్చు. ఆకాశం నుంచి జాతర దృశ్యాలను హెలి రైడ్స్ ద్వారా వీక్షించవచ్చు.

జనవరి 31వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి మేడారానికి అప్ డౌన్‌ ఒక్కొక్కరి నుంచి రూ.35వేల999లు ఛార్జ్ చేస్తారు. ఇక జాతర వ్యూను చూడాలనుకునేవారికి కూడా అవకాశం ఉంటుంది. 6-7 నిమిషాల జాతర విహంగ వీక్షణ జాయ్ రైడ్‌కు ఒక్కొక్కరికి రూ.4వేల 800 తీసుకుంటారు. మేడారం సమీపంలోని పడిగాపూర్​వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి జాయ్​రైడ్ ఉంటుంది.

జనవరి 28నుంచి మహాజాతర మెుదలుకానుంది. ఈ సర్వీసులను వారం ముందు నుంచే ప్రారంభమయ్యాయి. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తుంబి ఎయిర్​ లైన్స్ ​ఈ సర్వీసులను అందిస్తోంది. జాతర ముగిసే తేదీ 31 వరకు హెలికాప్టర్ సేవలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాల కోసం 8530004309, 9676320139 నెంబర్లను సంప్రదించవచ్చు.

జాతర ముఖ్యమైన తేదీలు

  • జనవరి 27 - మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి పయనం. ఇదే రోజు తాడ్వాయి మండలంలో కన్నెపల్లి నుంచి జంపన్న బయలుదేరి మేడారం గద్దెకు చేరుకుంటారు.
  • జనవరి 28 - కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత, ఏటూరునాగారం మండలంలో గల కొండాయి నుంచి గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా నుంచి బయలుదేరిన పగిడిద్దరాజులు గద్దెకు చేరుకుంటారు.
  • జనవరి 29 - వనదేవత సమ్మక్క చిలుకలగుట్ట నుంచి బయలుదేరి గద్దెపైకి వస్తారు.
  • జనవరి 30 - భక్తులు ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లిస్తారు.
  • జనవరి 31 - దేవతల వన ప్రవేశం.
  • ఫిబ్రవరి 4 - తిరుగువారం పండుగ, మహా జాతర ఉత్సవాల ముగింపు ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe