మేడారం జాతర కోలాహలం మెుదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులు వనదేవతల దర్శనానికి వస్తున్నారు. ఎత్తుబంగారం సమర్పిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అనేక రకాల ఏర్పాట్లు చేసింది. టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. మరోవైపు హెలికాప్టర్ సేవల ద్వారా కూడా మేడారం వెళ్లవచ్చు. అంతేకాదు మేడారంలో ఏరియల్ వ్యూ కోసం కూడా హెలికాప్టర్ ఎక్కవచ్చు.

మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. జనవరి 22వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ దాకా ఈ సర్వీసులు కొనసాగుతాయి. హనుమకొండ నుంచి భక్తులు మేడారానికి హెలికాప్టర్లో వెళ్లవచ్చు. ఆకాశం నుంచి జాతర దృశ్యాలను హెలి రైడ్స్ ద్వారా వీక్షించవచ్చు.
జనవరి 31వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి మేడారానికి అప్ డౌన్ ఒక్కొక్కరి నుంచి రూ.35వేల999లు ఛార్జ్ చేస్తారు. ఇక జాతర వ్యూను చూడాలనుకునేవారికి కూడా అవకాశం ఉంటుంది. 6-7 నిమిషాల జాతర విహంగ వీక్షణ జాయ్ రైడ్కు ఒక్కొక్కరికి రూ.4వేల 800 తీసుకుంటారు. మేడారం సమీపంలోని పడిగాపూర్వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి జాయ్రైడ్ ఉంటుంది.
జనవరి 28నుంచి మహాజాతర మెుదలుకానుంది. ఈ సర్వీసులను వారం ముందు నుంచే ప్రారంభమయ్యాయి. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తుంబి ఎయిర్ లైన్స్ ఈ సర్వీసులను అందిస్తోంది. జాతర ముగిసే తేదీ 31 వరకు హెలికాప్టర్ సేవలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాల కోసం 8530004309, 9676320139 నెంబర్లను సంప్రదించవచ్చు.
జాతర ముఖ్యమైన తేదీలు
- జనవరి 27 - మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి పయనం. ఇదే రోజు తాడ్వాయి మండలంలో కన్నెపల్లి నుంచి జంపన్న బయలుదేరి మేడారం గద్దెకు చేరుకుంటారు.
- జనవరి 28 - కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత, ఏటూరునాగారం మండలంలో గల కొండాయి నుంచి గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా నుంచి బయలుదేరిన పగిడిద్దరాజులు గద్దెకు చేరుకుంటారు.
- జనవరి 29 - వనదేవత సమ్మక్క చిలుకలగుట్ట నుంచి బయలుదేరి గద్దెపైకి వస్తారు.
- జనవరి 30 - భక్తులు ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లిస్తారు.
- జనవరి 31 - దేవతల వన ప్రవేశం.
- ఫిబ్రవరి 4 - తిరుగువారం పండుగ, మహా జాతర ఉత్సవాల ముగింపు ఉంటుంది.