సూపర్ ఐడియా సర్ జీ.. హైదరాబాద్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్లో హిస్టరీ షీటర్లు!
ఒకప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన హిస్టరీ షీటర్లు ఇప్పుడు ట్రాఫిక్ విధుల్లో పాల్గొంటున్నారు. ట్రాఫిక్ సమస్య కలగకుండా మేనేజ్మెంట్ చేస్తున్నారు.
రాచకొండ పోలీసులు కమిషనరేట్లోని కీలక జంక్షన్లలో ట్రాఫిక్ నిర్వహణ విధుల్లో హిస్టరీ-షీటర్లను(ఒకప్పుడు రౌడీ షీటర్లు) చేర్చే ఒక వినూత్నమైన సంస్కరణ ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం నేరాలు వదిలి జనంలో ఉంటున్న వారిని సమాజ సేవలో పాల్గొనడానికి, వారిని చూసి ఎవరూ భయపడకుండా ఉండేందుకు ప్రోత్సహిస్తుంది. స్థిరమైన సానుకూల ప్రవర్తన, మార్పు, సంస్కరణలను అంగీకరించడానికి సుముఖత చూపిన హిస్టరీ-షీటర్లను గుర్తించి రద్దీగా ఉండే ట్రాఫిక్ పాయింట్ల వద్ద నియమించారు.

ఉప్పల్, ఎల్బీ నగర్, ECIL వంటి ప్రధాన జంక్షన్లలో హిస్టరీ షీటర్లు, ట్రాఫిక్ సిబ్బందితో కలిసి పనిచేశారు. వాహనాల కదలికను నిర్వహించడంలో, ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడ్డారు. ఈ కార్యక్రమంపై కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమం అర్థవంతమైన మార్పును సృష్టించడం, ఒకప్పుడు నేరాలతో ముడిపడి ఉన్న వ్యక్తులను సమాజ సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ గతాన్ని సరిదిద్దుకుని ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
తాము తమ తప్పులను గుర్తుంచుకుంటామని, కానీ ఇప్పుడు ప్రజలకు సహాయం చేయడం ఆనందంగా అనిపిస్తుందని ఓ హిస్టరీ షీటర్ తెలిపారు.
కుషాయిగూడ డివిజన్లో మాత్రమే 20 మంది హిస్టరీ-షీటర్లు ట్రాఫిక్ అవగాహన, నియంత్రణ కార్యకలాపాలలో పోలీసులకు మద్దతు ఇచ్చారు. ఉప్పల్, ఎల్బీ నగర్ లాంటి ఏరియాల్లో కూడా ఇలాంటి భాగస్వామ్యం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ నుండి 20 మంది హిస్టరీ షీటర్లు ట్రాఫిక్ విభాగంతో చేతులు కలిపారు.
సంస్కరణలో భాగంగా సత్ప్రవర్తన కలిగిన రౌడీ షీటర్లను ఎంపిక చేశారు. నిర్మాణాత్మక పాత్రల్లోకి చేర్చడానికి సంస్కరణ కార్యక్రమాలను మరిన్ని ప్లాన్ చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. కేవలం అమలు చేయడమే కాకుండా సమాజాన్ని సానుకూల మార్పు వైపు నడిపించడమే లక్ష్యమన్నారు.
ఇందులో చాలా మంది ఒకప్పుడు అనుకోని పరిస్థితుల్లో నేరాలకు పాల్పడీ రౌడీ షీటర్ల ముద్ర వేసుకున్నారు. కానీ చాల మంది మారిపోయి ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. వారిలో వచ్చిన మార్పులను చూసిన రాచకొండ కమిషనర్ ప్రజాలకు సేవ చేసేందుకు తీసుకువస్తున్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్లో పాల్గొనేలా చేస్తున్నారు.













