Hyderabad : తండ్రి సమాధి దగ్గరకు వెళ్లేందుకు హైదరాబాద్‌లో కారు చోరీ

తండ్రి సమాధి దగ్గరకు వెళ్లేందుకు హైదరాబాద్‌లో ఓ వ్యక్తి కారు చోరీ చేశాడు. అంతేకాదు అందులో ఉన్న వస్తువులను కూడా తీసుకున్నాడు.

Updated on: Aug 27, 2026, 08:40:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని ప్రముఖ పిస్తా హౌస్ అవుట్‌లెట్ వ్యాలెట్ పార్కింగ్ వద్ద ఒక వ్యక్తి కారును ఎత్తుకెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఒక పాత నేరస్థుడు, కర్ణాటకలోని తన తండ్రి సమాధిని దర్శించుకోవడానికి డబ్బులు లేక ఈ కారు చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో కారు చోరీ
హైదరాబాద్‌లో కారు చోరీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టు అయిన నిందితుడిని రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్న 30 ఏళ్ల సయ్యద్ మజర్ గా గుర్తించారు. మజర్ సాధారణ వ్యక్తి కాదు, అతడు ఒక అలవాటుపడిన పాత నేరస్థుడు. గతంలో అనేక ఆస్తి సంబంధిత నేరాలు,హింసాత్మక నేరాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అతడు పలుమార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. గుడిమల్కాపూర్, లంగర్ హౌస్, సనాత్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతనిపై గతంలో కేసులు ఉన్నాయి. 2024లో అరెస్ట్ అయిన అతడు సంగారెడ్డిలోని కంది జైలుకు రిమాండ్ ఖైదీగా కూడా వెళ్లి వచ్చాడు.

మిలాద్-ఉన్-నబి పండుగ దగ్గర పడుతుండటంతో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న తన తండ్రి సమాధిని సందర్శించాలని మజర్ భావించాడు. అయితే ప్రయాణ ఖర్చులకు అతడి వద్ద తగినంత డబ్బు లేదు. దీంతో మళ్లీ దొంగతనం చేయాలని పథకం పన్నాడు.

ఆగస్టు 22న అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నంబర్ 169 వద్ద ఉన్న పిస్తా హౌస్ అవుట్‌లెట్‌కు మజర్ వెళ్లాడు. అక్కడ వ్యాలెట్ పార్కింగ్ సిబ్బంది కస్టమర్ల కార్ల కీలను కౌంటర్ వద్ద ఉంచుతున్న విషయాన్ని గమనించాడు. సిబ్బంది అందరూ కస్టమర్లకు సేవలు అందించడంలో బిజీగా ఉన్న సమయంలో, మజర్ చాకచక్యంగా కౌంటర్ నుంచి రెండు కార్ల తాళాలను దొంగిలించాడు.

ఆ తాళాలు ఏ ఏ కార్లవో తెలుసుకోవడానికి పార్కింగ్ ఏరియాలో తిరుగుతూ తాళాల బటన్లు నొక్కాడు. అవుట్‌లెట్ పక్కన పార్క్ చేసి ఉన్న ఒక ఐ20 కారు లైట్లు వెలగడాన్ని గమనించాడు. వెంటనే చేతిలో ఉన్న మరొక తాళాన్ని అక్కడ పడేసి, ఆ ఐ20 కారులో పరారయ్యాడు.

కారు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన ఐ20 కారుతో పాటు ఒక లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ కారులో ఉన్న 11 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు మాత్రం ఇంకా రికవరీ కావలసి ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి తదుపరి చర్యలు చేపట్టారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More