క్యూనెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం: గోవా రిసార్ట్లో ఐదుగురు అరెస్ట్
మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) పేరుతో లక్షల రూపాయల మోసానికి పాల్పడుతున్న క్యూనెట్ (QNET) ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. గోవాలోని ఒక రిసార్ట్లో ఉన్న ఐదుగురు కేరళ వాసులను అరెస్ట్ చేసి, విచారణ కోసం హైదరాబాద్కు తరలించారు.
హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్కీమ్ల పేరుతో అమాయకులను ముంచుతున్న క్యూనెట్ సంస్థపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గోవాలోని ఒక రిసార్ట్లో కంపెనీ ఈవెంట్ నిర్వహిస్తుండగా దాడి చేసిన పోలీసులు ఐదుగురు ప్రతినిధులను అరెస్ట్ చేశారు. నిందితులంతా కేరళ రాష్ట్రానికి చెందినవారు. వారి నుంచి మూడు లగ్జరీ వాహనాలతో పాటు పలు కీలక డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ మోసం వెనుక పెద్ద కుట్రే ఉంది. జూలై 16న బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో జిమ్ ఏర్పాటు చేసేందుకు స్థలం కోసం వెతుకుతుండగా, సోషల్ మీడియా ద్వారా నిందితుల్లో ఒకరు అతడికి పరిచయమయ్యాడు. వ్యాపార ప్రతిపాదన పేరుతో జూలై 9న బాధితుడిని బెంగళూరుకు పిలిపించారు. అక్కడ క్యూనెట్ (విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) సంస్థను విలాసవంతమైన వస్తువుల వ్యాపారంగా పరిచయం చేశారు.
నకిలీ విజయగాథలు, వీడియో ప్రెజెంటేషన్లతో నమ్మించిన నిందితులు, బాధితుడిపై ఒత్తిడి తెచ్చి ఏకంగా రూ. 7.50 లక్షలు పెట్టుబడి పెట్టించారు. ఆ తర్వాత గోవాలో జరగబోయే లీడర్షిప్ ఈవెంట్లో పాల్గొనేందుకు, స్థానాన్ని ఖరారు చేసుకునేందుకు తక్షణమే రూ. 30,000 బుకింగ్ మొత్తం చెల్లించాలని నిబంధన పెట్టారు. వారి మాటలు నమ్మిన బాధితుడు ఆ మొత్తాన్ని నిందితుడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశాడు. కాగా, నిందితులు రాతపూర్వక మెసేజ్లను ప్రోత్సహించకుండా, కేవలం ఫోన్ కాల్స్, ఆన్లైన్ మీటింగ్లు మాత్రమే నిర్వహిస్తూ తీవ్ర గోప్యత పాటించాలని ఒత్తిడి తెచ్చారు.
గోవా రిసార్ట్లో స్పెషల్ ఆపరేషన్
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్యూనెట్ ప్రతినిధులు ఉత్తర గోవాలోని కాండోలిమ్లో ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్ బృందం జూలై 18న గోవాలోని రిసార్ట్పై దాడి చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది.
న్యాయపరమైన ప్రక్రియల అనంతరం నిందితులను గోవాలోని మపుసా ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని హైదరాబాద్ తరలించేందుకు న్యాయస్థానం ట్రాన్సిట్ వారెంట్ మంజూరు చేసింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
క్యూనెట్ మాయలో పడకండి: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. క్యూనెట్ లేదా ఇతర మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM), పిరమిడ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్లలో పెట్టుబడులు పెట్టవద్దని, ప్రచారం చేయవద్దని స్పష్టం చేశారు.
"క్యూనెట్ వంటి నకిలీ సంస్థలు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం ఇస్తామని, పాసివ్ ఇన్కమ్ వస్తుందని ఆశచూపి ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగ యువత, గృహిణులు మరియు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటాయి. తెలిసీ తెలియక ఇటువంటి చట్టవిరుద్ధమైన పథకాలకు ప్రచారం చేసినా, నిధులు సేకరించినా 'ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్, 1978' ప్రకారం తీవ్రమైన క్రిమినల్ చర్యలు తప్పవు" అని పోలీసులు హెచ్చరించారు.
గతంలో గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్ నెట్ పేర్లతో కార్యకలాపాలు సాగించిన హాంకాంగ్ ఆధారిత క్యూఐ గ్రూప్, భారతదేశంలో 'విహాన్ డైరెక్ట్ సెల్లింగ్' పేరుతో క్యూనెట్ బ్రాండ్ను నడుపుతోంది. దీనిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


