హైదరాబాద్లోని కోఠి ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన దోపిడీ, కాల్పుల ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనను పోలీస్ శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఈ కేసు దర్యాప్తునకు, నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశామని ప్రకటించారు.
కాల్పుల ఘటనపై సీపీ సజ్జనార్ ప్రకటన

“ఈ ఘటనకు సంబంధించి సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నం. 28/2026 గా కేసు నమోదు చేయబడింది. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 109 (హత్యాయత్నం), 309 (దోపిడీ) ఆయుధ చట్టం-1959 లోని సెక్షన్ 27 కింద అభియోగాలు మోపబడ్డాయి” అని సీపీ సజ్జనార్ తెలిపారు.
“ఫిర్యాదుదారుడు కేరళలోని కోజికోడ్కు చెందిన రిన్షాద్ పి.వి. (26) (తండ్రి: అబ్దుల్ అజీజ్), రెడీమేడ్ పిల్లల దుస్తుల వ్యాపారి. ప్రస్తుతం నాంపల్లిలోని జనతా అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. జనవరి 7, 2026న దివాన్ దేవ్ఢీలో హోల్సేల్ స్టాక్ కొనుగోలు నిమిత్తం రూ. 6 లక్షల నగదుతో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. కొనుగోలు కుదరకపోవడంతో… తన బంధువు మిష్బాన్ సలహా మేరకు ఆ నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి నిర్ణయించుకున్నాడు” అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
“జనవరి 31, 2026న ఉదయం సుమారు 7 గంటలకు, తన స్నేహితుడు అమీర్కు చెందిన వాహనంపై కోఠి బ్యాంక్ స్ట్రీట్లోని ఎస్బీఐ ప్రధాన శాఖ ఏటీయం వద్దకు చేరుకున్నారు. అక్కడ నగదు జమ చేస్తుండగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెనుక నుండి వచ్చి…. తుపాకీని కడుపు వద్ద పెట్టి బెదిరించారు. దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరపగా…. అందులో ఒకటి ఫిర్యాదుదారుడి కుడి కాలికి తగిలి గాయమైంది. అనంతరం నిందితులు నగదు సంచితో పాటు వాహనం తాళంచెవులను బలవంతంగా లాక్కొని, బాధితుడి వాహనం (రిజిస్ట్రేషన్ నం. TS 08 HN 8582)లోనే అక్కడి నుంచి పరారయ్యారు” అని సీపీ సజ్జనార్ వివరించారు.
నిందితులు చాదర్ఘాట్ సిగ్నల్ మీదుగా నింబోలిఅడ్డా, కాచిగూడ వైపు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్కడ వాహనాన్ని వదిలివేసి… దుస్తులు మార్చుకుని కాచిగూడ చౌరస్తా వైపు కాలినడకన పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
{{/usCountry}}నిందితులు చాదర్ఘాట్ సిగ్నల్ మీదుగా నింబోలిఅడ్డా, కాచిగూడ వైపు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్కడ వాహనాన్ని వదిలివేసి… దుస్తులు మార్చుకుని కాచిగూడ చౌరస్తా వైపు కాలినడకన పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
{{/usCountry}}హైదరాబాద్ నగర పోలీసులు ఈ ఘటనపై తక్షణ చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. సాంకేతిక ఆధారాలను సేకరించడం, పొరుగు పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులతో సమన్వయం చేసుకోవడం జరుగుతోందని సీపీ సజ్జనార్ తెలిపారు.
“పౌరుల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం. నిందితులను త్వరగా పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం అన్ని వనరులను వినియోగిస్తోంది. అనుమానాస్పద కదలికలకు సంబంధించిన సమాచారం ఏదైనా ప్రజల వద్ద ఉంటే వెంటనే 'డయల్ 100' ద్వారా పోలీసులకు తెలియజేయగలరు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి” అని నగర సీపీ సజ్జనార్ ప్రకటించారు.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన సీపీ పుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది. తుపాకీ కాల్పులు జరపటంతో పాటు బైక్ పై పారిపోతున్న దృశ్యాలు కూడా ఇందులో రికార్డు అయ్యాయి.