కోకాపేట్‌లో ఎకరం రూ.120 కోట్లు.. హెచ్ఎండీఏ ఈ-వేలంలో రికార్డు ధరలు!

కోకాపేట్‌లో మరోసారి భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. హెచ్ఎండీఏ నిర్వహించన వేలంలో గోల్డెన్ మైల్, నియోపాలీస్ లేఅవుట్లలో రికార్డు ధరలు పలికాయి.

Published on: Sep 10, 2026, 08:34:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరోసారి రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. నగరంలోని అత్యంత విలాసవంతమైన, వ్యూహాత్మక ప్రాంతంగా పేరొందిన కోకాపేట్‌ భూములకు ఈ-వేలంలో ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్‌లోని గోల్డెన్ మైల్, నియోపోలిస్ లేఅవుట్‌లోని విలువైన భూములకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) నిర్వహించిన ఈ-వేలంలో బిల్డర్లు, డెవలపర్లు పోటీపడి మరీ కోట్లు కుమ్మరించారు.

హెచ్ఎండీఏ
హెచ్ఎండీఏ

HMDA విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, ఈ వేలంలో భూముల ధరలు కేటాయించిన అప్‌సెట్ ధర (కనీస మద్దతు ధర) కంటే చాలా రెట్లు ఎక్కువ ధరను పలికాయి.

గోల్డెన్ మైల్ సైట్-1 : ఇక్కడ ఉన్న 0.70 ఎకరాల భూమి ఎకరానికి రూ. 115 కోట్ల చొప్పున అత్యధిక బిడ్ దక్కించుకుంది. HMDA ఈ ప్లాట్‌కు ప్రాథమికంగా ఎకరానికి రూ. 70 కోట్లు అప్‌సెట్ ధరగా నిర్ణయించగా, వేలంలో ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకే ధర లభించింది.

నియోపోలిస్ లేఅవుట్ (ప్లాట్ నెం. 17): 4.59 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ నంబర్ 17కు సంబంధించి సింగిల్ బిడ్ ద్వారా ఎకరానికి అత్యధికంగా రూ. 120 కోట్ల ధర నమోదైంది.

హైదరాబాద్ పశ్చిమ ప్రాంత అభివృద్ధి కారిడార్‌లో కోకాపేట్‌ అత్యంత కీలకమైన వ్యాపార, నివాస కేంద్రంగా వేగంగా రూపాంతరం చెందుతోంది. ఈ భూములకు ఉన్న ప్రాధాన్యతను పరిశీలిస్తే.. ఔటర్ రింగ్ రోడ్డుకి అతి సమీపంలో ఉండటం వల్ల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా, సులువుగా చేరుకోవచ్చు.

గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ వంటి ప్రధాన ఐటీ ఉత్పత్తుల ప్రాంగణాలకు ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలోనే చేరుకునేంత సమీపంలో ఈ లేఅవుట్లు ఉన్నాయి.

HMDA నియోపోలిస్‌లో విస్తృతమైన మల్టీ-లేన్ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ సరఫరా వ్యవస్థలతో ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించింది. అంతేకాకుండా ఇక్కడ గగనతలాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి దిగ్గజ డెవలపర్లు ఆసక్తి చూపుతున్నారు.

ఈ వేలం ఫలితాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరత్వాన్ని, గ్లోబల్ ఇన్వెస్టర్లకు నగరంలో ఉన్న నమ్మకాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More