కొండాపూర్‌లో హైడ్రా యాక్షన్.. రూ.700 కోట్ల విలువైన 4 ఎకరాలు సేఫ్!

హైదరాబాద్‌లో విలువైన భూములను కాపాడుతుంది హైడ్రా. తాజాగా రూ.700 కోట్ల విలువైన భూములను రక్షించింది.

Published on: Feb 10, 2026 11:04 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొండాపూర్‌లో భారీ భూకబ్జాపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంది. సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించింది. జంగమోని కుంట ఆక్రమణలపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది హైడ్రా. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనగూడ మార్గం వరకు అధికారులు పరిశీలనలు చేపట్టారు.

రూ.700 కోట్ల విలువైన 4 ఎకరాలు కాపాడిన హైడ్రా
రూ.700 కోట్ల విలువైన 4 ఎకరాలు కాపాడిన హైడ్రా

సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జంగమోని కుంటను కబ్జాదారులు మట్టితో నింపి చదును చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయానికి సిద్ధం చేసినట్లు గుర్తించారు. ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో రెవెన్యూ శాఖతో కలిసి హైడ్రా జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. ఈ ఘటనపై కబ్జాదారులపై కేసులు నమోదు చేసిన రెవెన్యూ అధికారులు, చెరువును పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించారు. చెరువు పరిరక్షణలో భాగంగా హైడ్రా ఫెన్సింగ్ పనులు కూడా చేపట్టింది.

నార్సింగిలో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

ఇటీవలి కాలంలో హైదరాబాద్ మహానగర పరిధిలోని ప్రభుత్వ భూములను, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాలను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా దూకుడుగా వెళ్తోంది. తాజాగా నార్సింగిలో హైడ్రా కూల్చివేతలు చేసింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని అరుణోదయ హౌసింగ్ సొసైటీకి చెందిన సుమారు 1600 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేశారు కొందరు.

లేఅవుట్ నిబంధనలు పాటించడం లేదని, ప్రజల కోసం కేటాయించిన పార్కు స్థలాన్ని కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. సుమారు రూ.50 నుంచి 80 కోట్ల విలువైన పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుంది హైడ్రా. ఏళ్ల తరబడి కబ్జాదారు ఆధీనంలో ఉన్న భూమిని మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువచ్చింది. దీంతో జనాల్లో సంతోషం వ్యక్తమైంది. స్థలాల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు.

హైడ్రా ఫోన్ ఇన్ కార్యక్రమం

ప్రతి శ‌నివారం ఫోన్‌-ఇన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది హైడ్రా. సెల‌వు రోజులు మిన‌హా.. ప్రతి శ‌నివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఒంటి గంట వ‌ర‌కూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.

ఔట‌ర్ రింగురోడ్డు ప‌రిధిలో ఉన్న న‌గ‌ర ప్రజ‌లు 040-29565750, 040-29565759 ఈ రెండు ఫోను నంబ‌ర్లకు ఫోను చేసి ఫిర్యాదులు చేయ‌వ‌చ్చున‌ని తెలిపింది. చెరువులు, పార్కులు, ర‌హ‌దారులు, ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థలాల‌ ఆక్రమ‌ణ‌లు, చెరువుల్లో మ‌ట్టి పోయ‌డం వంటి అంశాల‌పై ఫిర్యాదు చేయ‌వ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఇచీవల తెలిపారు. గ‌తంలో ప్రజ‌లు ఇచ్చిన ఫిర్యాదులు ఏవైనా ప‌రిష్కారం కాక‌పోతే.. వాటి గురించి కూడా ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో తెలుసుకోవ‌చ్చన్నారు.