...
...
Next Story

నేను విద్యాశాఖ మంత్రిని అయితే కార్పొరేట్ విద్యాసంస్థలను మూసివేస్తా: కోమటిరెడ్డి

తాను విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ విద్యాసంస్థలను మూసివేసేవాడినని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎల్‌కేజీ చదువులకు సైతం కొందరు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Published on: Jan 28, 2026, 05:57:21 IST
Advertisement

తానే విద్యాశాఖ మంత్రినైతే తెలంగాణలోని కార్పొరేట్ విద్యా సంస్థలను మూసివేస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండలోని బొట్టుగూడలో కొత్తగా నిర్మించిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన తర్వాత మంత్రి మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చాయని, అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని అన్నారు. ' కొన్ని సంస్థలు విద్య పేరుతో ప్రజలను దోచుకుంటున్నాయి.' అని ప్రత్యేకంగా ఆరోపించారు. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.

పాఠశాల భవన ప్రారంభోత్సవంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పాఠశాల భవన ప్రారంభోత్సవంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

విద్యను వాణిజ్యీకరించకూడదని కోమటిరెడ్డి అన్నారు. పేద బతుకులు ఉన్న విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనలు 25 శాతం ఉచిత విద్యను నిర్దేశిస్తాయని గుర్తు చేసుకున్నారు. పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో విద్యను అభ్యసించడం ఉత్తమమని సూచించారు. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కార్పొరేట్ సంస్థలలో అధ్యాపకులుగా పనిచేస్తారని, పీహెచ్‌డీలు సహా ఉన్నత అర్హతలు ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో బోధిస్తారని అన్నారు.

అడ్మిషన్లు సీజన్‌లో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు వచ్చి పాఠశాలల్లో ఫీజులు తగ్గించేందుకు అడుగుతారని తెలిపారు. ఎల్‌కేజీ చదువులకు సైతం లక్షల్లో ఫీజులు ఉన్నాయన్నారు. తానే విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ విద్యాసంస్థలను మూసివేస్తానని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం కార్పొరేట్ విద్యాసంస్థల ప్రాధాన్యత తగ్గేలా ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశారని చెప్పారు.

కొత్త పాఠశాల భవనం గురించి ప్రస్తావిస్తూ.. నల్గొండలోని ఒక ప్రధాన ప్రదేశంలో 2,500 చదరపు గజాల స్థలంలో రూ.8 కోట్ల వ్యయంతో అత్యాధునిక భవనాన్ని నిర్మించినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దీనిని తన కలల ప్రాజెక్టుగా అభివర్ణిస్తూ, పాఠశాలలో 36 ఏసీ తరగతి గదులు, కంప్యూటర్ ప్రయోగశాల, లైబ్రరీ, ఆట స్థలం ఉన్నాయని అన్నారు. ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతున్నందున వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టుగా చెప్పారు. ప్రభుత్వ విద్యపై ప్రజలకు నమ్మకం కలిగించడానికి ఉపాధ్యాయులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కూడా ఆయన కోరారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe