...
...
Next Story

Montha Cyclone Update : మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు!

తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మొంథా తుపాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వానలు పడతాయని తెలిపింది.

Published on: Oct 28, 2025 12:51 PM IST
Advertisement

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. గత ఆరు గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి తీవ్ర తుఫానుగా మారింది మొంథా. ఇది మచిలీపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 190 కి.మీ, కాకినాడకు దక్షిణ-ఆగ్నేయంగా 270 కి.మీ, విశాఖపట్నంకు దక్షిణ-నైరుతి దిశలో 340 కి.మీ, గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణ-నైరుతి దిశలో 550 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటనుంది. ఈ సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా.

అక్టోబర్ 28న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, జనగాం జిల్లాలతో సహా ఇతర ప్రాంతల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటిలో కొన్ని ప్రాంతాలలో అక్టోబర్ 28 న 90–150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చు.

హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల 40–70 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్‌లో అక్టోబర్ 28న అంతట ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇప్పటికే భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

అక్టోబరు 29న (బుధవారం), 30వ తేదీల్లో కొన్ని జిల్లాల్లో భారీగా వర్షం పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. హైదరాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, కామారెడ్డి, వరంగల్ సహా అనేక ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe