Telangana Weather : హైదరాబాద్లో వర్షం - ఈ జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు
Telangana Weather Report : తెలంగాణలో రాబోయే ఐదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Weather Report : రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు…
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం… ఆగస్టు 18 మధ్యాహ్నం ఆగస్టు 20 ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. దీనితో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు , ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుసే సూచనలున్నాయి.
ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ అయ్యాయి.
ఆగస్టు 20 ఉదయం 8:30 గంటల నుంచి ఆగస్టు 23 ఉదయం 8:30 గంటల వరకు… తేలికపాటి వర్షాలు పడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఎలాంటి తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ పేర్కొంది.
ప్రజలు, ముఖ్యంగా నిరంతరం ప్రయాణాలు చేసేవారు ,వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు. ఈదురు గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నగరంలో వర్షం….
ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఉపశమనం కలిగిస్తూ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్, పంజాగుట్ట, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్పేట్, ఎస్ఆర్నగర్, సనత్నగర్, యూసఫ్గూడా, కృష్ణానగర్, మధురానగర్లతో పాటు లక్డీకాపూల్, ఖైరతాబాద్, మెహదీపట్నం ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అంతేకాకుండా ఎల్బీ నగర్, హయత్ నగర్, బీఎన్ నగర్ రెడ్డితో పాటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.
వర్షం పడటంతో ఐటీ కారిడార్తో పాటు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షపు నీరు రోడ్లపై నిలవడంతో అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

