నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, రాబోయే 12 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.

ఆ తర్వాత తదుపరి 48 గంటల్లో (నవంబర్ 29వ తేదీ సాయంత్రం లేదా 30వ తేదీ ఉదయం నాటికి) నైరుతి బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణకోస్తా తీరం వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీ మాత్రమే కాకుండా తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణలో మళ్లీ వర్షాలు…
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం….నవంబర్ 29వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక డిసెంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణం ఉంటుంది.
ఏపీలోనూ వర్షాలు….
ఇక ఏపీలో చూస్తే శని, ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శని, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.