...
...
Next Story

ఆ రెండు హై ప్రొఫైల్ కేసుల సాక్ష్యాలు చెక్కు చెదరలేదు.. ఫొరెన్సిక్ ల్యాబ్‌‌ ఘటనపై శిఖా గోయల్

నాంపల్లి ఫొరెన్సిక్ ల్యాబ్‌‌లో అగ్నిప్రమాదం ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ శిఖా గోయల్ స్పందించారు.

Published on: Feb 8, 2026, 15:34:35 IST
Advertisement

హైదరాబాద్‌ : నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా పుకార్లు వ్యాపిస్తున్నాయి. రెండు కీలక కేసులకు సంబంధించి సాక్ష్యాలు కాలిపోయాయని తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా రెండు హై ప్రొఫైల్ కేసులకు సంబంధించిన సాక్ష్యాలు సురక్షితంగా, చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టం చేశారు.

శిఖా గోయల్
శిఖా గోయల్

ప్రమాద స్థలానికి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్న మాలిక్యులర్ బయాలజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోయల్ మాట్లాడారు. 2015 ఓటుకు నోటు కేసు లేదా 2024 ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించిన ఏ సామాగ్రి కూడా అగ్నిప్రమాదంలో ధ్వంసం కాలేదని శిఖా గోయల్ తెలిపారు. ఈ ఘటన జరిగినప్పటి నుండి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఊహాగానాలు, తప్పుడు సమాచారాన్ని ఆమె ఖండించారు.

శనివారం ఉదయం నాంపల్లిలోని కంప్యూటర్ ఫోరెన్సిక్స్ ప్రయోగశాలలో అగ్నిప్రమాదం జరిగింది. కంప్యూటర్ ఫోరెన్సిక్స్ విభాగం నుండి పొగ వస్తుండటాన్ని గమనించిన సాయి కృష్ణ అనే ఉద్యోగి ఈ ఘటనను మొదట గుర్తించారని శిఖా గోయల్ తెలిపారు. పొగ గుర్తించే పరికరం వెంటనే అలారం మోగించడంతో అగ్నిమాపక సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఈ అగ్నిప్రమాదం కంప్యూటర్ ఫోరెన్సిక్స్ ప్రయోగశాల, ఒక శిక్షణా గది, గ్రంథాలయాన్ని ప్రభావితం చేసిందని శిఖా గోయల్ చెప్పారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేశారు. నష్టం అంచనా ప్రస్తుతం జరుగుతోంది.

ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావిస్తూ.. 2015లో ఎఫ్‌ఎస్‌ఎల్‌కు 16 వస్తువులు అందాయని, అదే సంవత్సరం కేసు ఫైల్‌ను ఏసీబీ కోర్టుకు సమర్పించామని శిఖా గోయల్ చెప్పారు. 'ఆ 16 వస్తువులన్నీ 2021లో కోర్టుకు తిరిగి అప్పగించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఈ కేసు సంబంధిత సామాగ్రి ఏదీ ఎఫ్‌ఎస్‌ఎల్‌లో లేదు.' అని క్లారిటీ ఇచ్చారు.

2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసుపై గోయల్ మాట్లాడుతూ.. మార్చి 2024, జనవరి 2026 మధ్య ఎఫ్‌ఎస్‌ఎల్‌కు 136 వస్తువులు అందాయని చెప్పారు. వీటిలో ఏడు వస్తువులు మినహా మిగిలినవన్నీ ఇప్పటికే పరిశీలించి, నివేదికలను సంబంధిత అధికారులకు సమర్పించామని తెలిపారు. మిగిలిన ఏడు అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం నివేదికలు సిద్ధం చేస్తున్నట్టుగా వెల్లడించారు. అనేక వస్తువులను ఇప్పటికే సంబంధిత అధికారులకు తిరిగి ఇచ్చామని, అగ్నిప్రమాదం సమయంలో అన్నింటిని సురక్షితంగా వెలికితీసి భద్రపరిచామని ఆమె చెప్పారు.

అగ్నిప్రమాదం వల్ల ప్రభావితమైన కంప్యూటర్ ఫోరెన్సిక్స్ విభాగం మినహా, ప్రయోగశాల ప్రస్తుతం పనిచేస్తోందని శిఖా గోయల్ వెల్లడించారు. అన్ని ఆధారాలు, పరికరాలను ఎఫ్ఎస్ఎల్ సురక్షితంగా ఉంచుతుందని తెలిపారు. ఏదైనా జరిగితే తమ టీమ్ సమాచారాన్ని పునరుద్ధరిస్తుందన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe