ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం.. వందకు వంద శాతం ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి పొంగులేటి కీలక హామీ
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో తగ్గేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్లను తప్పనిసరిగా అందిస్తామని చెప్పారు.
భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. పేదల సంక్షేమం, భద్రత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పట్టణాలు, గ్రామాల్లోని ప్రతి అర్హత కలిగిన పేదవాడికి సొంత ఇల్లు అనే కలను నెరవేర్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

'వందకు వంద శాతం పట్టణాలు, గ్రామాల్లోని అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కలను నెరవేర్చే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం తన భుజాలపైకి ఎత్తుకుంది.' అని మంత్రి పొంగులేటి అన్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని పొంగులేటి చెప్పారు. ఇందిరమ్మ చీరలు ధరించి సమావేశానికి వచ్చిన మహిళల ముఖాల్లో ఆనందాన్ని గమనించానని చెప్పారు.
రెండో దశలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుందని మంత్రి ప్రకటించారు. మరో మూడు దశల్లో అర్హులైన పేదలకు సొంత ఇళ్లను ఇస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ గృహ పథకంపై ఎటువంటి రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ 10 సంవత్సరాల పాలనలో పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఇళ్ల నిర్మాణాన్ని విస్మరించిందని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపు మొదటి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అందించామని వెల్లడించారు.
దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ వివాదాలను పరిష్కరించడానికి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టామన్నారు మంత్రి పొంగులేటి. సరైన పత్రాలు లేకపోవడం వల్ల భూమిని కలిగి ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి అన్నారు. ఇప్పుడు ఆ సమస్య లేదని చెప్పారు.

E-Paper












