కేసీఆర్, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఆస్తులపై విచారణ జరపాలి.. ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాల్

కేసీఆర్ భూమిని దేవతలాగా కొలిచే వ్యక్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఆట వ‌స్తువులా చూస్తున్నాడని విమర్శించారు.

Published on: Sep 17, 2026, 13:32:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం సమైక్యత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్

కేసీఆర్ ఆస్తుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మొన్నటివరకు కేసీఆర్ ఫామ్‌హౌస్ 1,000 ఎకరాలు ఉందంటూ ప్రచారం చేసిన రేవంత్, నిన్న మాత్రం 67 ఎకరాలు ఉందంటూ సరికొత్త మాటలు చెబుతున్నారు. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టంగా 67 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. అఫిడవిట్‌లో ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి కొత్తగా కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు.' అని ఎద్దేవా చేశారు. గతంలో ప్రగతి భవన్‌లో 150 బెడ్‌రూమ్‌లు, బంగారు బాత్రూమ్‌లు ఉన్నాయంటూ చేసిన ప్రచారాలు, ఆరు గ్యారంటీల అమలుపై ఆడుతున్న నాటకాలు ఎంత అబద్ధమో.. ఇప్పుడు రేవంత్ చెప్తున్న మాటలు కూడా అంతే అబద్ధమని ధ్వజమెత్తారు.

కేసీఆర్ కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ.. కేసీఆర్ పుట్టినప్పుడే చింతమడకలో రెండు ఎకరాల ఇల్లు ఉండేదన్నారు. ఆయన తండ్రికి వందల ఎకరాల భూమి ఉండేదని చెప్పారు. తమ స్వగ్రామంలోని రెండెకరాల ఇల్లును కూడా కేసీఆర్ ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి దానం చేశారని గుర్తుచేశారు. 1954 నాటికే మా కుటుంబానికి వందల ఎకరాల భూమి ఉందని, కేసీఆర్ పుట్టుకతోనే రైతు అన్నారు. ఆయన భూమిని దేవతలా పూజించి వ్యవసాయం చేస్తారు తప్ప మంది కొంపలు ముంచే పని చేయరని స్పష్టం చేశారు.

'గోడలకు పెయింట్లు వేసుకునే స్థాయి నుంచి జూబ్లీహిల్స్‌లో ప్యాలెస్ నిర్మించుకున్న నీకు లేని అభ్యంతరం.. స్వతహాగా రైతు అయిన కేసీఆర్ భూమి కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటే వచ్చిందా?.' అని రేవంత్‌ను ప్రశ్నించారు కేటీఆర్. కేసీఆర్‌పై చేసిన తప్పుడు వ్యాఖ్యలకు గానూ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ బంధువులు, ఇతర నేతల ఆస్తులను కావాలని కేసీఆర్ ఖాతాలో కలిపి చూపిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కూకట్‌పల్లికి చెందిన కొండల్ రావు ఆస్తులు, నవీన్ రావు, సంతోష్ రావుల ఆస్తులతో కేసీఆర్‌కు ఏంటి సంబంధమని నిలదీశారు. కేవలం కులానికి చెందినవారైనంత మాత్రాన లేదా చుట్టరికం ఉన్నంత మాత్రాన అందరి ఆస్తులను కేసీఆర్‌కు ఆపాదించడం రేవంత్ రెడ్డి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.

తన వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతూ.. 'నేను అమెరికాలో ఆరున్నర సంవత్సరాలు నిజాయితీగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాను. రేవంత్ రెడ్డి ఏ ఉద్యోగం చేసి ఆస్తులు సంపాదించారో చెప్పాలి.' అని కేటీఆర్ సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి ఏడేళ్ల పాటు డిగ్రీ చదివారని ఎద్దేవా చేసిన కేటీఆర్, కొండారెడ్డిపల్లికి పోతే రేవంత్ గతం ఏమిటో, అసలు నిజాలేమిటో అందరికీ బయటపడతాయని విమర్శించారు.

కేసీఆర్ పుట్టినప్పటి 1954 నుంచి 2026 వరకు కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరిపిస్తే మేం అన్ని ఆధారాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ అన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కుటంబ ఆస్తులపై కూడా విచారణ జరగాలని సవాల్ విసిరారు. ఇందుకోసం సిట్టింగ్ జడ్జికి లేఖ రాయాలని ముఖ్యమంత్రికి తెలిపారు. 'మీ కుటుంబ ఆస్తులు, మా కుటుంబ ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించండి.' అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. అసెంబ్లీని నెలరోజులు నడపాలన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More