...
...
Next Story

కాలేజీల్లో యాంటీ డ్రగ్ డిక్లరేషన్‌ కోసం నోటరీ తప్పనిసరా? ఇంటర్ బోర్డు ఏం చెబుతోంది?

Telangana Inter Admissions 2026 : ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం యాంటీ డ్రగ్ డిక్లరేషన్‌ ఇవ్వాలని బోర్డు తెలిపింది. అయితే చాలా మంది నోటరీ తీసుకోవాలా అని ప్రశ్నలు వేస్తున్నారు. దీనిపై ఇంటర్ బోర్డు తాజాగా క్లారిటీ ఇచ్చింది.

Published on: May 13, 2026 05:56 PM IST
Advertisement

తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ మెుదలైంది. అయితే యాంటీ డ్రగ్ అఫిడవిట్‌ కచ్చితంగా ఇవ్వాలని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఇంటర్ బోర్డు మరో ప్రకటన విడుదల చేసింది.

కాలేజీల్లో యాంటీ డ్రగ్ డిక్లరేషన్‌
కాలేజీల్లో యాంటీ డ్రగ్ డిక్లరేషన్‌

తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. ఈసారి అడ్మిషన్ల ప్రక్రియలో ప్రభుత్వం రెండు నిబంధనలను చాలా సీరియస్‌గా అమలు చేస్తోందని, ఆధార్ కార్డు, యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఇవ్వాలని ఇంటర్ బోర్డు పేర్కొందని వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అడ్మిషన్ సమయంలో విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులు కూడా మేం మత్తు పదార్థాలను వినియోగించబోం, విక్రయించబోం అని రాసి ఉన్న అఫిడవిట్‌పై సంతకం చేసి కళాశాలకు సమర్పించాల్సి ఉంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా మరోసారి ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది.

మత్తుపదార్థాల నిరోధక చర్యలకు సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశాల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులను నోటరైజ్డ్ అఫిడవిట్లను సమర్పించమని బలవంతం చేస్తున్నారని పేర్కొంటూ వచ్చిన కొన్ని నివేదికలు, సమాచారాల విషయం తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు (టీజీబీఐఈ) దృష్టికి వచ్చింది.

ఈ విషయంలో విద్యార్థులలో మత్తుపదార్థాల దుర్వినియోగంపై అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకునేలా చూడటం అనే లక్ష్యంతో కొత్త విధానాన్ని ఇంటర్ బోర్డు అమల్లోకి తెచ్చింది. ప్రవేశాల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి ఒక సాధారణ యాంటీ డ్రగ్ డిక్లరేషన్‌ను పొందాలని మాత్రమే బోర్డు అన్ని జూనియర్ కళాశాలలకు సూచించిందని స్పష్టం చేసింది.

ఈ ప్రకటనను ఎట్టి పరిస్థితుల్లోనూ నోటరైజ్డ్ అఫిడవిట్‌గా పరిగణించరాదని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ ప్రకటనను సమర్పించడం కోసం ఏ విద్యార్థి గానీ, తల్లిదండ్రులు గానీ నోటరీని సంప్రదించాల్సిన అవసరం లేదు లేదా ఎలాంటి ఖర్చు భరించాల్సిన అవసరం లేదు.

TGBIE-ACAD/ADMN/1/2024-ACAD, తేదీ 12.05.2026 ద్వారా జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరికీ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులకు ఈ వివరణ ఇప్పటికే తెలియజేశారు. సులభంగా యాక్సెస్ చేయడానికి, అమలు చేయడానికి డిక్లరేషన్ ఫారమ్‌లు TGBIE అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe