మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. ఫైనల్ గా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆయన… రాజీనామా లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. పార్టీలో జరిగిన అవమానాలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ పై ఫైర్….

సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ఆయన సొంత పార్లమెంట్ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. చేవెళ్ల ఎంపీ స్థానానికి తొలుత సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించి.. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డిని తెచ్చి అతనికి ఇచ్చారని విమర్శించారు. దాని ప్రభావం మహబూబ్ నగర్ అలానే చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లుపై పడిందన్నారు.
“తనకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎంతమందిని తొక్కుతావయ్య నువ్వు…? నీ తొక్కుడు కాదు రేవంత్ రెడ్డి.. ఈ జగిత్యాలలో ఏ శక్తి నన్ను ఆపలేదు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేశాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా పోరాటం చేస్తాను ”అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
నేను కొంతమంది లాగా ముఖ్యమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీకి రాలేదని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. నువ్వు(రేవంత్ రెడ్డి) ముఖ్యమంత్రి అయ్యావు.. కానీ మమ్మల్ని కూడా బతకనివ్వు అంటూ కామెంట్స్ చేశారు.
"రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా. నీతో అణగదొక్కబడటం కంటే పోరాటం చేస్తే నాకు పోయేది ఏముంది. వేం నరేందర్ రెడ్డి ఎవరు…? ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏంది…? పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరు..? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం..? బ్రతకడానికి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా నియామకం అయిన తర్వాత వాడు ఇచ్చిన సలహాలు ఏమైనా ఉన్నాయా…?" అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నలు గుప్పించారు.