కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గుడ్‌బై.. బీఆర్ఎస్‌లో చేరుతురా? రాజకీయాలకు దూరమవుతారా?

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిది ప్రత్యేకమైన రాజకీయ ప్రస్థానం. జగిత్యాల ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తారనే పేరు ఉంది. అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ వీడటంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Published on: Mar 17, 2026, 08:28:20 IST
By , Jagtial
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. ఈ మేరకు ఆయనే క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో మెుదటి నుంచి కీలక నేతగా ఉన్నారు. అయితే రానురాను పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతూ వచ్చారు. ఇందుకు కారణం ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్ పార్టీ సంజయ్‌కి ప్రాధాన్యం ఇస్తుందని జీవన్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు.

మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి
మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి

తాజాగా ఇవి ఎక్కువ అయ్యాయి. చివరకు జీవన్ రెడ్డి పార్టీని వీడే పరిస్థితికి వచ్చారు. జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్‌గా పిలిచే జీవన్ రెడ్డి నివాస ప్రాంగణంలో సోమవారం సాయంత్రం ఆయన సన్నిహితులు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు.

జగిత్యాల జిల్లాలో పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలను విస్మరించి, పార్టీలోకి కొత్తగా చేరిన వారికి అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ జీవన్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా చేరిన వారికే సీట్లలో ఎక్కువ భాగం కేటాయించడంపై ఆయన తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఈ విషయం హైదరాబాద్ వరకూ వచ్చింది. ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులపై ఆయన తన విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు.

తాను ఇంకా బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నానని సంజయ్ కుమార్ చెబుతున్నప్పటికీ.. గత నెలలో చొప్పదండిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ వేదికపై సంజయ్ కుమార్ కనిపించడం జీవన్ రెడ్డి అనుచరులకు ఆగ్రహం తెప్పించింది.

కార్యకర్తలు, తన అనుచరుల కోసం కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న తన అనుబంధాన్ని తెంచుకోవడానికి జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే తన తదుపరి రాజకీయ అడుగుపై ఈ సీనియర్ నాయకుడు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి ప్రయత్నించినప్పటికీ, వారి ప్రయత్నాలు ఫలించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

జీవన్ రెడ్డి కూడా వేరే పార్టీల్లో చేరే విషయాన్ని ఇంకా ఆలోచించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడటం మాత్రం ఖాయం అని క్లారిటీ ఇచ్చారు. సిద్ధాంతలకు అనుగుణంగా పని చేస్తానని చెప్పారు. అయితే ఇటీవల జీవన్ రెడ్డి అనారోగ్యపాలైన విషయం కూడా తెలిసిందే. రాజకీయాలకు ఇక దూరం అవుతారేమో అని కూడా కొందరు చర్చించుకుంటున్నారు.

సోమవారం నాడు జీవన్ రెడ్డి తన నివాసం నుండి కలెక్టరేట్ వరకు మొక్కజొన్న రైతులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా జీవన్ రెడ్డి నేతృత్వంలోని రైతుల ప్రతినిధి బృందం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులకు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఉగాది పండుగ నుండే తక్షణమే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని వినతిపత్రంలో కోరారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More