జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి అయింది. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్లను ఎన్నికల అధికారులు బుధవారం స్క్రూటినీ చేశారు. పరిశీలన తర్వాత… 81 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 135 నామినేషన్లకు మాత్రమే రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారు. 130 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయి.
నవంబర్ 11న పోలింగ్….

211 మంది అభ్యర్థులు మొత్తం 321 నామినేషన్లు దాఖలు చేయగా… వారిలో కొందరు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం ప్రారంభమైన నామినేషన్ పత్రాల పరిశీలనలో 81 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించగా…. 130 మంది అభ్యర్థులను తిరస్కరించినట్లు అధికారిక ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24గా ఉంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.
ఈ ఏడాది జూన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఈ ఉప ఎన్నిక తప్పనిసరి అనివార్యమైంది. వి.నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే భార్య మాగంటి సునీతను బరిలోకి దింపింది. బీజేపీ లంకల దీపక్ రెడ్డిని ఎంపిక చేసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు పార్టీ మద్దతు ఇస్తామని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
సున్నితమైన పోలింగ్ స్టేషన్ల విషయంలో ఈసీ ముందస్తు చర్యలు చేపడుతోంది. జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణను అమలు చేయనుంది.