టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌ను జాగృతిలోకి ఆహ్వానిస్తున్నాను.. మంచి పోస్ట్ ఇస్తా : కవిత

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌ను తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానిస్తున్నట్టుగా కల్వకుంట్ల కవిత చెప్పారు. ఆయనకు మంచి పోస్ట్ ఇస్తానని వ్యాఖ్యానించారు.

Published on: Jan 25, 2026 5:38 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు. తనను కాంగ్రెస్‌లోకి చేర్చుకోమని.. టీపీసీసీ అధ్యక్షుడు అంటున్నారని గుర్తుచేశారు. మహేశ్ కుమార్‌ గౌడ్‌ను జాగృతిలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. జాగృతిలో చేరితే మంచి పోస్ట్ ఇస్తానని ప్రకటించారు.

కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత

'అసలు నేనేందుకు కాంగ్రెస్‌లో చేరుతాను? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ. రానున్న ఎన్నికల్లో జాగృతి గెలవబోతోంది. నన్ను బద్నాం చేసే పనిలో మహేశ్ గౌడ్ ఉన్నారు. నేను కాంగ్రెస్‌లో చేరుతానని మహేశ్ కుమార్‌ గౌడ్‌కు కల వచ్చిందా? ఆయన మానసిక పరిస్థితి చెక్ చేసుకోవాలి. బలమైన రాజకీయ పార్టీగా జాగృతిని మార్చే ప్రయత్నం చేస్తున్నాను.' అని కవిత అన్నారు.

సృజన్ రెడ్డికి కాంట్రాక్టులను ఇప్పించింది హరీశ్ రావే అని కవిత ఆరోపణలు చేశారు. సృజన్ రెడ్డి పెద్ద తిమింగలంగా మారేందుకు ఆయననే కారణం అని చెప్పారు. రేవంత్ రెడ్డికి సృజన్ రెడ్డి బావమరిది అని హరీశ్ రావుకు అప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. ఆ గుంతలో కేటీఆర్ పడటం బాధకరమన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాయను అని హరీశ్ రావు చెప్పడం దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానించడమేనన్నారు.

'కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని హరీశ్ రావు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడక్కుండా సీబీఐ ఎలా వస్తుంది? ఈ విషయం హరీశ్ రావుకు తెలియదా? 2014 నుంచి జరిగిన సింగరేణి టెండర్లపై విచారణ జరపాలని చెబుతున్నారు. అంటే కేసీఆర్ పాలన మీద కూడా హరీశ్ రావు విచారణ కోరుతున్నట్టే కదా?' అని కవిత అడిగారు.

సింగరేణి కార్మికుల కోసం జాగృతి పోరాటం చేస్తుందన్నారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడటం బాధాకరమని కవిత అన్నారు. జీతాలు ఇచ్చేందుకు కూడా సింగరేణి వద్ద నిధులు లేవన్నారు. తెలంగాణ జాగృతి రెండేళ్లుగా సింగరేణి టెండర్లపై మాట్లాడుతుందని చెప్పారు. భట్టి విక్రమార్క కనీసం స్పందించలేదన్నారు. సింగరేణికి చెందిన 25 టెండర్లలో ఎక్కువ బీఆర్ఎస్ నేతలకు చెందిన కంపెనీలకే దక్కాయని తెలిపారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తీసుకురావడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పిదమన్నారు.