'నాకు కూడా టైం వస్తుంది... ఏదో ఒక రోజు సీఎం అవుతా' - కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కూడా టైం వస్తుందని.. ఏదో ఒక రోజు సీఎం అవుతానని చెప్పుకొచ్చారు. తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని చెప్పారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయవల్ల తనకు అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతానని చెప్పుకొచ్చారు. తనకు కూడా ఏదో ఒక రోజు టైమ్ వస్తుందన్నారు. అప్పుడు ఏ ఒక్కరిని కూడా వదలనన్నారు. ఒక్కొక్కళ్ళ తోలు తీస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాను సీఎం అయితే… 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని అక్రమాలను బయటకు తీస్తానని కవిత హెచ్చరించారు. తనకో అవకాశం వస్తుందని అప్పుడు ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తానని కామెంట్స్ చేశారు. అధికారంలోకి రాగానే అవినీతి పై విచారణ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఎవర్నీ వదిలిపెట్టను - కవిత వార్నింగ్
"నాపై అసత్య ఆరోపణలు చేసిన ఎవ్వరిని వదిలిపెట్టను. తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికీ లీగల్ నోటీసులు పంపిస్తా. తెలంగాణ కోసం అవసరం వచ్చినప్పుడు నా నగలు కుదువ పెట్టి బతుకమ్మ చేసిన నేను. నేను ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను లేవనెత్తుతుంటే కొంతమంది నాయకులకు భయం పుట్టుకుంది. అందుకే నా మీద ఈ ఆరోపణలు చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు" అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన భర్తపై అసత్య కథనాలను ప్రసారం చేసిన టీ న్యూస్ కు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు కవిత చెప్పారు. వారం రోజులలోపు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, టీ న్యూస్ యాజమాన్యం వారం రోజుల లోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే కోర్టును ఆశ్రయించి… న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
“మాధవరం కృష్ణారావు… నీ మీద దాడి చేసే అంత పెద్ద మనిషిని కాదు. నీకు అంత సీన్ లేదు. నీ వెనుక ఉండి నడిపిస్తున్న గుంట నక్కని వదిలి పెట్టేది లేదు. ఏవి రెడ్డితో వ్యాపారం చేస్తున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎవరి దోస్త్ ఎవరి బినామీ…? పోచంపల్లి పందెం కోళ్ల కేసు ఏమైంది..?” అంటూ కవిత మరోసారి బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు.
‘జాగృతి జనం బాట’లో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇటీవలే కవిత పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావును టార్గెట్ చేస్తూ… కవిత కొన్ని ఆరోపణలు చేశారు.సుమారు రూ. 2,000 కోట్ల రూపాయల విలువైన భూములను గత ప్రభుత్వం విక్రయించినప్పటికీ కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆమె విమర్శించారు.
కవిత చేసిన ఈ విమర్శలకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెంటనే కౌంటర్ ఇచ్చారు. కవిత చరిత్ర ఏంటో తనకు బాగా తెలుసునని, ఆమె ఏ బంగారం దుకాణాన్ని వదల్లేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు. కవిత సంగతి.. ఆమె భర్త సంగతి తనకు పూర్తిగా తెలుసునని చెప్పుకొచ్చారు.
'మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసు. నీ బండారం బయటపెడితే నువ్వు బయట కూడా తిరగలేవు' అని కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్పై ఉన్న అభిమానంతోనే తాము ఇప్పటి వరకు కవితపై మాట్లాడలేదని స్పష్టం చేశారు. కవిత భర్త అనిల్ అక్రమాల చిట్టా తన వద్ద ఉందని చెప్పుకొచ్చారు. కవిత లిక్కర్ క్వీన్ అని.. అందుకు ఆమె ఇంట్లో పెరుగుతున్న పెంపుడు కుక్కే నిదర్శనమన్నారు. ఆ కక్కకు ఆమె విస్కీ అని పేరుపెట్టారని.. దీన్నిబట్టే ఆమె లిక్కర్ వ్యాపారం గురించి అర్థం చేసుకోవచ్చునని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కవిత, కృష్ణారావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిపోయింది.














