KBR Park One Way Traffic : కేబీఆర్ పార్క్‌ చుట్టూ నేటి నుంచే వన్‌వే అమల్లోకి

KBR Park One Way Traffic : కేబీఆర్ పార్క్‌ చుట్టూ నేటి నుండి వన్‌వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చింది. దాదాపు ఏడాదిన్నర పాటు ఇది అమలులో ఉంటుంది. మారిన వివరాలను ఇక్కడ చూడండి.

Published on: Aug 18, 2026, 06:57:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ పరిధిలోని కాసు బ్రహ్మానంద రెడ్డి(KBR) నేషనల్ పార్క్ చుట్టూ ప్రయాణించే వాహనదారులకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 18 మంగళవారం నుండి ఈ ప్రాంతంలో వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. రూ. 1,090 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(H-CITI) ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ఈ మార్పులు చేశారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు దాదాపు ఏడాదిన్నర (18 నెలలు) పాటు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

కేబీఆర్ పార్క్ వన్ వే
కేబీఆర్ పార్క్ వన్ వే

ప్రయాణికులు తమ గమ్యస్థానాలను సులభంగా చేరుకోవడానికి, అయోమయానికి గురికాకుండా ఉండటానికి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక లేన్ మార్కింగ్‌లు, లేన్ ఛేంజర్లను ఏర్పాటు చేశారు. ప్రతి రెండు జంక్షన్ల మధ్య ఒక లేన్ ఛేంజర్ అందుబాటులో ఉంటుంది.

ఇదివరకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుండి ఎన్టీఆర్ భవన్ లేదా అన్నపూర్ణ బైలేన్ వైపు వెళ్లే వాహనాలు మహారాజా అగ్రసేన్ ఐలాండ్ వద్ద కుడి మలుపు తీసుకునేవి.

ఇకపై మహారాజా అగ్రసేన్ ఐలాండ్ వద్ద కుడి మలుపు తీసుకోవడం నిషేధించారు. వాహనదారులు ఐలాండ్ నుండి ఎడమ వైపు మలుపు తీసుకుని, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా ప్రయాణించి.. క్రీమ్ స్టోన్ వద్ద ఉన్న లేన్ ఛేంజర్ నంబర్ 10 ద్వారా ఎన్టీఆర్ భవన్ లేదా అన్నపూర్ణ బైలేన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

ఈ వన్-వే విధానం వల్ల వాహనాలు ఒకే దిశలో సాఫీగా సాగుతాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. పౌరులు ఈ ట్రాఫిక్ నిబంధనలను పాటించి, విధుల్లో ఉన్న సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ వన్ వే ట్రాఫిక్ మార్గాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్, సిసిటీవీ కెమెరాల నెట్‌వర్క్ ద్వారా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా రియల్ టైమ్ నిఘా కోసం డ్రోన్లను కూడా రంగంలోకి దించుతున్నారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేబీఆర్ పార్క్‌కు వచ్చే వాకర్స్ తమ వాహనాలను కేవలం కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో లేదా మల్టీ-లెవల్ పార్కింగ్ భవనంలో మాత్రమే పార్క్ చేయాలి. ముఖ్యంగా ఉదయం వేళల్లో రోడ్డుపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు.

కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లలో నిత్యం తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. తాజా గణాంకాల ప్రకారం పిక్ అవర్స్‌లో వివిధ జంక్షన్లలో వాహనాల రద్దీ (ప్యాసింజర్ కార్ యూనిట్లు - PCU): జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ గంటకు అత్యధికంగా 15,321 PCUలు, కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ జంక్షన్ గంటకు 13,516 PCUలు, మహారాజా అగ్రసేన్ జంక్షన్: గంటకు 10,356 PCUలు, రోడ్ నంబర్ 45 జంక్షన్ గంటకు 9,966 PCUలుగా ఉంటుంది.

తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎమ్‌డీఏ సంయుక్తంగా చేపడుతున్న ఈ H-CITI ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రధాన జంక్షన్లలో ఏడు మల్టీ-లెవల్ స్టీల్ ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వాహనాల రద్దీ తగ్గి, ట్రాఫిక్ కష్టాలు 80 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More