Hyderabad Traffic : వాహనదారులకు అలర్ట్ - కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్, ఆగస్టు 18 నుంచి కొత్త నిబంధనలు!

KBR Park one way traffic Hyderabad : హెచ్-సిటీ ప్రాజెక్టు ఫ్లైఓవర్ పనుల వల్ల కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్-వే ట్రాఫిక్ నిబంధనలను అమలు చేస్తారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటన చేశారు.

Published on: Aug 12, 2026, 05:12:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

KBR Park one way traffic Hyderabad : హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ కారిడార్‌ పరిధిలో ప్రయాణించే వాహనదారులకు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్, హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్ట్‌లో భాగంగా చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ నిర్మాణ కార్యకలాపాల వల్ల ప్రస్తుతం ఉన్న రోడ్డు వెడల్పు తగ్గిపోయి రవాణాకు పరిమిత స్థలం మాత్రమే అందుబాటులో ఉంది.

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

వన్-వే ట్రాఫిక్ విధానం అమలు…

రోజురోజుకు వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో ఇరువైపులా వాహనాలను అనుమతిస్తే తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు, ప్రయాణంలో ఆలస్యం మరియు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని నియంత్రించి, వాహనాల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ శాశ్వత ప్రాతిపదికన వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం నిర్ణయించింది.

ఈ వన్-వే విధానాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ముందు, దీని సాధ్యాసాధ్యాలు, క్షేత్రస్థాయి అవసరాలను అంచనా వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రెండుసార్లు ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్స్ నిర్వహించారు.

  • మొదటి ట్రయల్: 05.04.2026న సుమారు 3 గంటల పాటు నిర్వహించారు.
  • రెండవ ట్రయల్: 21.06.2026న సుమారు 6 గంటల పాటు అమలు చేశారు.

ఈ రెండు ట్రయల్స్ సమయంలో వాహనాల వేగం, జంక్షన్ల వద్ద పనితీరు, లైన్ క్రమశిక్షణ, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలు, వాహనదారుల ప్రయాణ సరళిని పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఆ సమయంలో వ్యక్తమైన అభ్యంతరాలు, సేకరించిన కీలక విషయాల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి, ఆగస్టు 18 నుంచి కొత్త వన్-వే రోడ్ల నిబంధనను పక్కాగా అమలు చేయడానికి సర్వం సిద్ధం చేశారు.

వాహనదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు:

కొత్త ట్రాఫిక్ విధానంలో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కింది ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి...

  • ప్రధాన రహదారులపై అవసరమైన ప్రదేశాల్లో స్పష్టమైన లైన్ మార్కింగ్‌లు, లైన్ చేంజింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు.
  • కీలకమైన కూడళ్ల వద్ద దిశలను సూచించే సైన్ బోర్డులు, హెచ్చరిక సూచికలను అమర్చారు.
  • ప్రయాణికులకు దారి చూపేందుకు, సహాయం అందించేందుకు ముఖ్యమైన జంక్షన్లలో 24 గంటల (24x7) పాటు ట్రాఫిక్ సిబ్బందిని విధుల్లో ఉంచుతున్నారు.
  • వాహనదారులు తమ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకోవడానికి వీలుగా గూగుల్ మ్యాప్స్ , నావిగేషన్ యాప్‌లలో కొత్త మార్గాలను అప్‌డేట్ చేశారు.
  • సిటీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, విస్తృత సీసీటీవీ నెట్‌వర్క్ ద్వారా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
  • ట్రాఫిక్ రద్దీని తక్షణమే అంచనా వేసేందుకు వీలుగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా రియల్ టైమ్ డ్రోన్ మానిటరింగ్ నిర్వహిస్తున్నారు.

ప్రారంభ రోజుల్లో క్షేత్రస్థాయి ట్రాఫిక్ పరిణామాలను నిరంతరం సమీక్షిస్తూ, అవసరమైన చిన్న చిన్న మార్పులు చేస్తామని పోలీసులు తెలిపారు. కొత్త వన్-వే మార్గాలను దృష్టిలో ఉంచుకుని మీ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. రోడ్డుపై ఉన్న లైన్ మార్కింగ్‌లు, సైన్ బోర్డులు, విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు వంటి అత్యవసర వాహనాలకు లైన్-2 ద్వారా ఆటంకం లేకుండా దారి ఇవ్వాలని సూచించారు.

హెచ్-సిటీ నిర్మాణ పనుల దృష్ట్యా, కేబీఆర్ పార్క్ చుట్టూ రవాణాను మరింత సురక్షితంగా, సులభంగా మార్చేందుకు మాత్రమే ఈ వన్-వే మార్పులు తెచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్పుల సమయంలో నగర పౌరులంతా పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. సూచించిన మార్గాల్లో ప్రయాణించడం, లైన్ క్రమశిక్షణ పాటించడం వల్ల ఈ నూతన విధానం విజయవంతమవుతుందని ఆకాంక్షించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More